కృతి చేతిలో ఏడు సినిమాలు‌

8 Apr, 2021 01:36 IST|Sakshi

కృతీ సనన్‌ కదా... కృతీ సెవన్‌ అని ఉందేంటీ అనుకుంటున్నారా? ఇప్పుడు కృతి చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. అసలు విషయం అది. చేస్తున్న సినిమాల లొకేషన్స్‌కి తిరుగుతూ కొన్ని నెలలుగా ఆమె ఫుల్‌ బిజీ. ఇటీవల జైసల్మేర్‌లో ‘బచ్చన్‌ పాండే’ షెడ్యూల్‌ పూర్తి చేసి, ఆ తర్వాత ప్రభాస్‌తో చేస్తున్న ‘ఆదిపురుష్‌’ ముంబయ్‌ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నారు. అక్కడ ‘భేడియా’ సినిమా షూట్‌లో ఉన్నారు. ఈ నెల 10 వరకూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉండి, ఆ తర్వాత ‘ఆదిపురుష్‌’ కోసం ముంబయ్‌ చేరుకుంటారు.

ఇంకా ఇవి కాకుండా ‘గణ్‌పత్‌’, ‘మిమీ’, ‘హమ్‌ దో హమారే దో’తో పాటు మరో సినిమా కృతి చేతిలో ఉన్నాయి. ఇలా ఒకేసారి ఏడు సినిమాలు చేయడం వల్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారట కృతి. ముఖ్యంగా కరోనా సోకకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారట. ఏమైనా జరిగితే ఏడు చిత్రాల షెడ్యూల్స్‌ తారుమారవుతాయి కదా! అందుకే జాగ్రత్తగా ఉంటున్నారు. 2014లో ‘1: నేనొక్కడినే’ చిత్రం ద్వారా కథానాయిక అయ్యారు కృతీ సనన్‌. ఆ తర్వాత తెలుగులో ‘దోచెయ్‌’ సినిమా చేశారు. అప్పటినుంచి హిందీ చిత్రాలకే పరిమితమైన కృతీ సనన్‌ డైరీలో ఇలా ఒకేసారి ఏడు సినిమాలు ఉండటం ఇదే మొదటిసారి. ఈ బిజీని ఆమె ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. చేతి నిండా పని ఉంటే ఆ ఆనందమే వేరు కదా!

మరిన్ని వార్తలు