అదిగదిగో ఆస్కార్‌... మన తరఫున ‘వైట్‌ టైగర్‌’...

22 Apr, 2021 22:07 IST|Sakshi

అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. గత 2002లో లగాన్‌ తరువాత ఈ సంవత్సరం వైట్‌ టైగర్‌ చిత్రం ఆస్కార్‌ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్‌ మూవీ పోటీపడుతుండడంతో ఈ సారి అకాడమీ పండుగ మనవారికీ ఆసక్తిగా మారింది. ఈ  ఏప్రిల్‌ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్‌ మూవీస్, స్టార్‌ వరల్డ్‌ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది.  అవార్డుల వేడుకలను తిలకించడమే...అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే...

ద వైట్‌ టైగర్‌: లగాన్‌ తరువాత ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ కాబడ్డ చిత్రమిది. రాజ్‌కుమార్‌ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం  ఉన్న  ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్, పారాసైట్‌ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం.

 

ద పాధర్‌: ఫ్లోరియన్‌ జెల్లర్‌ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్‌ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుంది.

జుడాస్‌ అండ్‌ ద బ్లాక్‌ మెసయ్య: చారిత్రాత్మక బయోపిక్‌ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్క్రిప్ట్‌... ప్రతిఒక్కటీ అద్భుతమే !

మంక్‌: డేవిడ్‌ ఫించర్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను ఆయన తండ్రి జాక్‌ ఫించర్‌ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు.

మినారీ: లీ ఇసాక్‌ రచనదర్శకత్వం వహించిన కొరియన్‌ అమెరికన్‌ ఫ్యామిలీ చిత్రమిది.  స్ఫూర్తిదాయక  కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్‌ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది.

నోమడ్‌ల్యాండ్: అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది. ఓ సంక్షోభంలో అన్నీ కోల్పోయిన  60ఏళ్ల వయసులోని మహిళ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. 

ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం. ఓ అమ్మాయి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలతో సాగుంది.  అద్భుతమైన అభినయం, దర్శకత్వాల కలయిక ఈ చిత్రం. 

సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌:తన వినికిడి శక్తిని కోల్పోవడం ప్రారంభించిన ఓ హెవీ మెటల్‌ డ్రమ్మర్‌ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది. ఈ సినిమా ఆద్యంతం భావోద్వేగాలతో, వాస్తవికంగా  సాగుతుంది. ఈ సినిమాలో కధానాయకుడు ఫీలయ్యే అనేక భావాలను మనమూ ఫీలయ్యేంతగా మనల్ని లీనం చేసుకుంటుంది. రిజ్‌ అహ్మద్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. 

ద ట్రయల్‌ ఆఫ్‌ ద చికాగో: కోర్ట్‌ రూమ్‌లో సంభవించే ఆసక్తికర అంశాలను అద్భుతంగా చిత్రీకరించిన వైనం ఆకట్టుకుంటుంది. కొన్ని దశాబ్ధాల క్రితం 1969లో నిజంగా చికాగోలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా తీసిన చిత్రమిది.  

చదవండి: ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి: చిరంజీవి

మరిన్ని వార్తలు