Niitin Mehta: మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్‌

8 Jul, 2022 17:06 IST|Sakshi

అనుకోకుండా యాక్టర్‌ అయ్యాను అన్న మాట తరచూ వింటూ ఉంటాం. అలాంటి కోవలోకే వస్తాడు అఖండ విలన్‌ గజేంద్ర సాహు అలియాస్‌ నితిన్‌ మెహతా. 21 ఏళ్లపాటు ఇండియన్‌ ఆర్మీకి సేవలందించిన ఆయన ప్రస్తుతం నటుడిగా రాణిస్తున్నాడు. మరి ఆర్మీ నుంచి రిటైర్‌ అయిన ఆయన సినిమాలవైపు ఎలా అడుగులేశాడు అన్నదాని గురించి తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు.

'ఆర్మీ నుంచి రిటైర్‌ అయ్యాక నేను గడ్డం పెంచి కొత్త లుక్‌ ట్రై చేశాను. అలా అని సినిమాల్లోకి, మోడలింగ్‌లోకి రావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఓ రోజు హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఓ ఫిలింమేకర్‌ కంటపడ్డాను. ఆ తర్వాత ఢిల్లీలో తొలిసారి మోడల్‌గా కనిపించాను. అనంతరం ఫ్యాషన్‌ వీక్స్‌లో పాల్గొనాలంటూ ఫోన్‌ వచ్చింది. అలా యాడ్స్‌లో, చివరికి సినిమాల్లో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఈ జర్నీ నాకు చాలా నచ్చింది. అనుకోకుండా ఈదారిలో పడ్డా ప్రయాణం మాత్రం బాగుంది.

అఖండ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. బాలకృష్ణగారితో పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఆయనతో పని చేసినప్పుడు ఈ ఇండస్ట్రీకి నేను కొత్తవాడిని అన్న ఫీలింగే రానీయలేదు. ప్రతికూల పాత్రల్లో నటించడం బాగుంది. అది ఓ రకమైన కిక్‌ ఇస్తోంది. దక్షిణాది సినిమాలు బాగుంటాయి. నేను సినిమాల్లోకి రావడానికి ముందే తెలుగు మూవీస్‌ చూసేవాడిని. మున్ముందు కూడా విలన్‌ పాత్రలు చేయాలనుంది. చిరంజీవి, నాగార్జున, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో స్క్రీన్‌పై తన్నులు తినాలనుంది. ఇతర దక్షిణాది భాషల్లోనూ నటించాలనుంది. ప్రస్తుతానికైతే రావణాసుర, స్పై మూవీస్‌ చేస్తున్నాను. అలాగే ఓ తమిళ చిత్రం కూడా చేస్తున్నా' అని తెలిపాడు నితిన్‌ మెహతా.

చదవండి: హీరో విక్రమ్‌కు గుండెపోటు
రామ్‌ చరణ్‌ చేతులమీదుగా 'పరంపర 2' ట్రైలర్‌..

మరిన్ని వార్తలు