రణ్‌బీర్‌కి కరోనా... క్వారంటైన్‌లో ఆలియా!

10 Mar, 2021 01:31 IST|Sakshi

బాలీవుడ్‌ను కరోనా మళ్లీ కలవరపెడుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి నీతూ సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ‘‘రణ్‌బీర్‌కు కరోనా సోకింది. హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. రణ్‌బీర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు నీతూ. మరోవైపు బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి  కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో, ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గంగూబాయి కతియావాడి’ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అంతే కాదు.. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఆలియా భట్‌ హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆమెకు కరోనా కాకపోయినా ఈ మధ్య ‘గంగూబాయి..’ షూటింగ్‌లో పాల్గొనడం, అలాగే రణ్‌బీర్‌తో తాను నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కోసం అతన్ని కలవడంవల్ల ఆలియా క్వారంటైన్‌లో ఉంటున్నారు. ‘గంగూబాయి కతియావాడి’ సినిమా జూలై 30న విడుదల కానుంది.


రణ్‌బీర్‌ కపూర్‌, సంజయ్‌ లీలాభన్సాలీ 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు బ్రేక్‌? 
కరోనా టెన్షన్‌తో హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు ఆలియా భట్‌. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షెడ్యూల్‌లో మార్పు చేయాల్సి వస్తుందనే టాక్‌ వినబడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరిం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన ఒలివియా మోరిస్, రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌ అయిపోగానే రామ్‌చరణ్, ఆలియా భట్‌ కాంబినేషన్‌లో ఓ భారీ సాంగ్‌ను షూట్‌ చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేసిందట. కానీ కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఆలియా భట్‌ హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో ఈ షూటింగ్‌ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు