Gautham Vasudev Menon: స్టార్ హీరో మూవీ వాయిదా.. డైరెక్టర్‌ ఆసక్తికర పోస్ట్!

29 Nov, 2023 11:50 IST|Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం చిత్రం ధృవనచ్చితిరం.  స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గౌతమ్ మీనన్ అభిమానులకు షాకిచ్చాడు. అయితే తాజాగా ఆయన ఓ లేఖను పోస్ట్ చేశారు. ధృవనచ్చితిరం త్వరలోనే మీ ముందుకు వస్తుందని గుడ్‌ న్యూస్ చెప్పారు. 

దర్శకుడు లేఖలో రాస్తూ.. ''ఒక విజన్, అభిరుచి, అంకితభావంతో ధృవ నచ్చితిరాన్ని తెరకెక్కించాం. మాకు ఎంత వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ ముందుకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. నవంబర్ 24న విడుదల చేయనందుకు అభిమానులు నిరాశకు గురైన మాట వాస్తవమే. ఇప్పటికీ మేము సినిమా రిలీజ్ విషయంలో  ప్రేక్షకులకు భరోసా ఇవ్వడానికే పోస్ట్ చేస్తున్నా. మూవీకి ఉన్న అడ్డంకులను తొలగించి ధృవ నచ్చితిరమ్‌ను త్వరలోనే మీముందుకు తీసుకొస్తాం' అని అన్నారు.

ఈ విషయంలో ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఇప్పటికైనా వివాదాలు తొలగిపోయి మూవీ రిలీజ్ కావాలని విక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  కాగా.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఆర్. పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు