Angelina Jolie: వాళ్లింకా షాక్‌లో ఉన్నారు.. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టిన హీరోయిన్‌

1 May, 2022 11:54 IST|Sakshi

ఒక్కసారి యుద్ధంలోకి దిగాక వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నట్లుగా ఉంది రష్యా తీరు. నానాటికీ ప్రతికూల పరిణామాలే ఎదురవుతున్నా సరే యుద్ధాన్ని మాత్రం ముగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.

ఇక దాడులు, కాల్పులతో ఉక్రెయిన్‌ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలో ఓ హాలీవుడ్‌ హీరోయిన్‌ ఏంజెలినా జోలి ఉక్రెయిన్‌లో అడుగుపెట్టింది. యుద్ధంలో అందరినీ కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన చిన్నారులను పరామర్శించింది.

ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ ప్రత్యేక ప్రతినిధిగా ఆమె శనివారం లివివ్‌ సిటీలో పర్యటించింది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఆమె అక్కడి వాలంటీర్లతో మాట్లాడింది. ఈ సందర్భంగా వాలంటీర్లు.. అక్కడ తలదాచుకుంటున్న పిల్లలంతా దాదాపు 2 నుంచి 10 ఏళ్లలోపే పిల్లలని చెప్పుకొచ్చారు.

'వాళ్లు ఇ‍ప్పటికీ షాక్‌లోనే ఉన్నారు.. ఈ యుద్ధ ప్రభావం పిల్లలను ఎంత ప్రభావితం చేస్తుందో నేను ఊహించగలను. వారికోసం నిలబడటం చాలా అవసరం' అని ఏంజెలినా జోలి చెప్పుకొచ్చింది. అనంతరం స్టేషన్‌లోని పిల్లలతో, వాలంటీర్లతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగింది. కాగా ఈ యుద్ధం వల్ల గత రెండు నెలల్లో 12.7 మిలియన్ల మంది ప్రజలు(ఉక్రెయిన్‌ జనాభాలో 30% మంది) ఇల్లు విడిచి వెళ్లిపోయారు.

చదవండి: 'మాయి' సిరీస్‌లో మూగ అమ్మాయిగా నటించిందెవరో తెలుసా?

పక్కింట్లో టీవీ చూసే బుడ్డి సుమ సినిమాల్లోకి రావడం అదృష్టం

మరిన్ని వార్తలు