Janhvi Kapoor: అమ్మ బతికుండగా నాన్న ఆ పని చేయలేదు

26 Oct, 2022 16:38 IST|Sakshi

దక్షిణాది సినిమాల్లో సత్తా చాటిన అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేశారు. స్టార్‌ హీరోయిన్‌గా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలతో జనాలను అలరించారు. అయితే మాంసాహారిగా ఉన్న ఆమె బోనీ కపూర్‌ వల్ల శాఖాహారిగా మారిందట. డాక్టర్లు రిస్క్‌ అని హెచ్చరించినా ఆమె మాంసం ముట్టలేదట. తాజాగా ఈ విషయాన్ని శ్రీదేవి పెద్దకూతురు జాన్వీ కపూర్‌ వెల్లడించింది.

పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇది చాలాకాలం క్రితం జరిగింది. నాన్న సిగరెట్లు ఎక్కువగా తాగేవాడు. నేను, ఖుషి పొద్దున్నే లేచి సిగరెట్‌ ప్యాకెట్లు వెతికి నాశనం చేసేవాళ్లం. సిగరెట్లను కత్తిరించేయడమో, వాటిని ఓపెన్‌ చేసి టూత్‌పేస్ట్‌ రాయడమో చేసేవాళ్లం. కానీ ఎంత ప్రయత్నించినా ఆయన తన అలవాటు మానుకోలేదు. ఈ విషయంలో అమ్మ.. నాన్నతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేది.

నాన్న సిగరెట్లు మానేసేవరకు మాంసం ముట్టుకోనని శపథం చేసింది. కానీ అమ్మ చాలా వీక్‌గా ఉందని, మాంసం తినకపోతే ఇబ్బంది అవుతుందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా అమ్మ వినిపించుకోలేదు. నాన్న బతిమిలాడినా తన పట్టు విడవలేదు. చివరాఖరకు ఇప్పుడా విషయాన్ని గుర్తు చేసుకుని నాన్న బాధపడుతున్నాడు. తన కోసం ఇప్పుడైనా పొగ తాగడం మానేస్తానన్నాడు' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్‌. కాగా శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న మరణించిన విషయం తెలిసిందే!

చదవండి: రెచ్చిపోయిన ఉర్ఫీ జావెద్‌, కేసు నమోదు
గీతూ ఓవరాక్షన్‌, మండిపడ్డ హౌస్‌మేట్స్‌

మరిన్ని వార్తలు