Jayasudha: నేను అలా చేయడంతో విశ్వనాథ్‌ గారికి కోపం వచ్చింది, నిజానికి ‘సాగర సంగమం’ నేను చేయాలి: జయసుధ

22 Feb, 2023 11:13 IST|Sakshi

దివంగత దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్‌ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కళాంజలి పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి, సహజ నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయసుధ విశ్వానాథ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఎంతోమంది హీరోయిన్లు విశ్వనాథ్‌ దర్శకత్వంలో మంచి మంచి సినిమాలు చేశారు. కానీ జయసుధ మాత్రం ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించలేదు అని అందరికి అనిపించి ఉంటుంది. ఎన్నో క్లాసికల్‌ సినిమాలు తీసిన ఆయనకు ఎందుకో ఆయన కమర్షియల్‌ సినిమా చేయాలనుకున్నారు. దానికి నన్ను అడిగారు. అలా ఆయన దర్శకత్వంలో నేను కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి కమర్షియల్‌ చిత్రాలు చేశాను.

అయితే ఆయన తీసిన సాగర సంగమం సినిమా నేను చేయాలి. ఏడిద నాగేశ్వరావు గారు ముందు నన్ను అడిగారు. అలాగే అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. కమల్‌ హాసన్‌ గారు బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యమైంది. అదే సమయంలో నేను ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో డేట్స్‌ కుదరకపోవడంతో నేను ఈ సినిమా నుంచి తప్పుకున్నా’ అని చెప్పారు. అయితే సాగర సంగమం సినిమా కోసం నేను తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేశాను. దాంతో విశ్వనాథ్‌ గారు నాపై చిన్నగా అలిగారు.

చాలా రోజులు నాతో మాట్లాడలేదు. నేను ఎక్కడ కనిపించిన ఆయన హూమ్‌ అన్నట్టుగా చూసేవారు. అది అలాగే చాలా రోజులు కొనసాగింది. ఆ తర్వాత నేను ఆయనతో ఇక సినిమాలు చేయలేకపోయా. కానీ నిజం చెప్పాలంటే సాగర సంగమంలో ఆ పాత్రకు జయప్రదే కరెక్ట్‌ అనిపించింది. ఆమె చాలా గొప్పగా చేసింది. అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత చాల కాలం తర్వాత ఓసారి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ‘నాతో నటిస్తావా?’ అని అడిగారు. అదే ఆయనతో తన చివరి మాటలు అని జయసుధ ఎమోషనల్‌ అయ్యారు. 

చదవండి: 
నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్‌ రష్మీ

మరిన్ని వార్తలు