Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు

30 Oct, 2021 14:44 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌​ ఆకస్మిక మరణం యావత్‌ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన అప్పూ పార్ధివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్‌,  టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు.

ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కీలక విషయాన్ని ప్రకటించారు. కర్ణాటక పర్యాటకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను,యాప్‌ను విడుదల చేయమని కోరుతూ గురువారం పునీత్‌ తనను కలిసారని తెలిపారు. నవంబరు ఒకటిన ఈ యాప్‌ను లాంచ్‌ చేయాల్సి ఉందని కానీ దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకుండా పోయారంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆయన మరణం తమతోపాటు, సినీ రంగానికి, ముఖ్యంగా యువతకు తీరని లోటని  సీఎం పేర్కొన్నారు.

పునీత్ కుమార్తె అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని శనివారం సాయంత్రం 7 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ సంప్రదాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రాజ్‌కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్త్నుట్లు ఆయన ప్రకటించారు. (Puneeth Rajkumar: ఏం పాపం చేశాడు దేవుడా! శోకసంద్రంలో అభిమానులు)

కాగా శుక్రవారం తమిళనాడులోని గాజనూరులో పునీత్ రాజ్‌కుమార్ పర్యటించాల్సి ఉంది. దీంతో ఆయన అభిమానులు పునీత్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అప్పూ ఇక లేడన్న వార్త వారిని శోకసంద్రంలో ముంచేసింది. మరోవైపు పునీత్‌ భౌతిక కాయాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచి కడసారి దర్శించు కునేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పునీత్‌కు తుది నివాళులర్పించేందుకు అభిమాన జనం వేలాదిగా తరలివచ్చారు. చిరంజీవి, ఎన్టీఆర్‌, బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నరేశ్‌, శివబాలాజీ, ప్రభుదేవా తదితర సినీ ప్ర‌ముఖులు పునీత్‌ కుమార్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Puneeth Rajkumar: పునీత్‌, అశ్విని రేవంత్‌ లవ్‌ స్టోరీ..వైరల్‌)

మరిన్ని వార్తలు