సంగీత దర్శకుడు అమ్రీష్‌కు ఊరట

17 Jun, 2021 09:10 IST|Sakshi

మోసం కేసును కొట్టేసిన మద్రాసు హైకోర్టు

సాక్షి ప్రతినిధి, చెన్నై: సీనియర్‌ నటి, దర్శక, నిర్మాత జయచిత్ర కుమారుడు, సంగీత దర్శకుడు అమ్రీష్‌పై నమోదైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసినట్లు ఆయన తరఫు న్యాయవాది ఎల్‌ ఇన్ఫెంట్‌ దినేష్‌ తెలిపారు. చెన్నైలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో చెన్నై వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యాపారవేత్త, ఇరీడియం పేరుతో అమ్రీష్‌ రూ. 26 కోట్లు మోసం చేశారంటూ ఇటీవల ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ కేసులో అమ్రీష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా బెయిల్‌పై బయటకు వచ్చినట్లు చెప్పారు.

తనపై అక్రమంగా బనాయించిన కేసును కొట్టి వేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ అమ్రీష్‌ వేశారని, వారి మధ్య ఒక చిత్రానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయని, ఆయన నిర్మించనున్న ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తంలో కొంత తిరిగి చెల్లించానని, పూర్తిగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని అమ్రీష్‌ కోర్టుకు విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు సమ్మతించిన సదరు పారిశ్రామికవేత్త అమ్రీష్‌పై ఇచ్చిన ఫిర్యాదును వాపస్‌ తీసుకున్నట్లు వెల్లడించారు. వాదనలను విన్న అనంతరం సదరు కేసుతో అమ్రీష్‌కు సంబంధం లేనందున కేసును కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి నిర్మల్‌ కుమార్‌ మంగళవారం తీర్పు చెప్పారని న్యాయవాది ఇన్ఫెంట్‌ దినేష్‌ తెలియజేశారు.

చ‌ద‌వండి: 'ఆమెతో డేటింగ్‌ చేశాను!' అందులో నిజమెంతో ఎవరికి తెలుసు?

>
మరిన్ని వార్తలు