విద్యార్థులకు బిర్యానీ వడ్డించిన నయనతార.. వివాదంలో చిక్కున 'అన్నపూరణి' సినిమా

4 Dec, 2023 10:31 IST|Sakshi

మొదటిసారి ప్రమోషన్స్‌కు వచ్చిన నయన్‌

విద్యార్థులకు బిర్యానీ వడ్డించి ఆపై సందడి

బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా  సినిమా ఉందంటూ వ్యతిరేకత

సినిమాపై వ్యతిరేకతకు కారణాలు ఇవే

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తాజాగ తన 75వ సినిమా విడుదలైంది. 'అన్నపూరణి' ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనేది ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్‌ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నికిలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చింది. కానీ ఈ చిత్రం కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది.

జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రంలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా నటించింది. ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కోరిక ఆమెలో ఉంటుంది. దీనిని ఆమె తండ్రి వ్యతిరేకిస్తాడు. అయితే, తండ్రి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా నయనతార ఎలా ఎదిగింది. ఆ తర్వాత ఆ రంగంలో ఆమెకు ఎదురయ్యే సవాల్ ఏంటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

కేవలం తమిళంలో మాత్రమే ఈ నెల 1 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌తో పాటు నయనతార కూడా చెన్నైలోని ఓ లేడీస్‌ కాలేజ్‌ను సందర్శించారు. లంచ్‌ టైమ్‌కి వెళ్లి వారందరితో సందడిగా కనిపించారు. ఆపై వారందరికీ స్వయంగా నయనతారనే బిర్యానీ వడ్డించారు. అలా ఒక్కసారిగా తమ అభిమాన తారలను చూడగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాధారణంగా నయనతార సినిమా విడుదల సమయంలో ఎలాంటి ప్రచారాలు చేయదు. వాటంన్నిటికీ ఆమె కాస్త దూరంగానే ఉంటారు. కానీ 'అన్నపూరణి' చిత్రం కోసం నయనతార ఇప్పుడిలా చేయడంతో యూనిట్‌ సభ్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

(ఇదీ చదవండి: 'అన్నపూరణి' చిత్రం రివ్యూ.. పబ్లిక్‌ టాక్‌)

'అన్నపూరణి చిత్రాన్ని బ్యాన్‌ చేయాలి'
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువతి పాత్రలో నయనతార ఇందులో నటించడం ఆపై ఆమె ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదిగే క్రమంలో ఆమె చేస్తున్న వంటలు పలు వివాదాలకు దారి తీసింది. ఇందులోని కథాంశం కూడా బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా ఉందని రాష్ట్రీయ హిందూ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు వేలు తెలిపాడు. దానికి తోడు ముస్లిం యువకుడు బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తున్నట్లు ఈ చిత్రంలో చూపించడంపై ఆయన తప్పుబట్టారు. సినిమాను బ్యాన్ చేయాలని ఆయన కోరారు. సినిమా మేకర్స్‌పై సివిల్ కేసు పెట్టడమే కాకుండా థియేటర్ల వద్ద దిగ్బంధనం చేస్తామని వేలు హెచ్చరించారు. హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం కరెక్ట్‌ కాదని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు