Lakshmi Manchu: ముంబైకి షిఫ్ట్‌ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్‌కు కూడా రెడీ అంటూ..

12 Oct, 2023 18:12 IST|Sakshi

యాంకర్‌, నటి మంచు లక్ష్మి ముంబైకి చెక్కేసింది. హైదరాబాద్‌ నుంచి తన మకాంను ముంబైకి మార్చేసింది. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు ఎంతో కృతజ్ఞతలు. నాపై నమ్మకముంచి నా మీద ఎల్లవేళలా ప్రేమాభిమానాలు కురిపించే అభిమానులందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్‌ చేసింది. అయితే టాలీవుడ్‌లో తనకు అవకాశాలు సన్నగిల్లాయని బాలీవుడ్‌కు మకాం మార్చేయలేదు. తన నటనా పరిధిని విస్తృతపరిచుకునేందుకే ముంబైకి షిఫ్ట్‌ అయినట్లు పేర్కొంది.

ఆఫీసుకు రమ్మన్నా వస్తాను
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'సౌత్‌లో చాలా రకాల రోల్స్‌ చేశాను. కానీ అవి కొన్ని పరిమితులకు లోబడే ఉన్నాయి ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ముంబైలో అయితే అది వీలవుతుంది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆడిషన్స్‌కు కూడా సిద్ధమే! ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ముంబైలో నేను స్టార్‌ కిడ్‌ను కాదు. ఇక్కడ కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకిదే సరైన సమయమని భావిస్తున్నాను. నిజానికి నేను లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లిపోదామనుకున్నాను.

నాన్న అలాగే భయపడ్డాడు
కానీ మా అమ్మ ఒకరకంగా భయపడి బెంగపెట్టేసుకుంది. సరే, అయితే ముంబైకి షిఫ్ట్‌ అవుతానని చెప్పా.. అమ్మ సరేనంది. తను ఎప్పుడూ నా నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. నాన్న మాత్రం ముంబై అనగానే అక్కడ మాఫియా ఉంటుంది.. అక్కడికి ఎందుకు? అని అడిగాడు. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటే ప్రతి తండ్రి ఎలా భయపడతాడో మా నాన్న కూడా అలాగే భయపడ్డాడు' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మకాం పెట్టిన మంచు లక్ష్మి ఆదివారం నాడు తన స్నేహితులకు బర్త్‌డే పార్టీ ఇచ్చింది.

చదవండి: సినిమా కోసం ఇల్లు కూడా అమ్మేశా, ఆయనను కలిసిన తెల్లారే హత్య.. అలా కేసులో ఇరుక్కున్నా

మరిన్ని వార్తలు