నరసాపురం రూరల్: కొత్తపాలెంలో రోడ్డుపై నడిచి వెళుతుండగా కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మొగల్తూరు ఎస్సై ఎం.వీరబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మొగల్తూరు మండలం కొత్తపాలెంకు చెందిన ఉన్నమట్ల పెద్దిరాజు (37) శనివారం ఇంటి నుంచి గ్రామ కూడలి వద్దకు నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఓ కారు వేగంగా ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై పెద్దిరాజును గ్రామస్తులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎ చెప్పారు.
దొంగతనం కేసులో నిందితుడికి జైలు
ఇరగవరం: దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఓ నిందితుడికి 14 నెలల జైలు శిక్ష విధిస్తూ తణుకు కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు తణుకు రూరల్ సీఐ సీహెచ్ ఆంజనేయులు శనివారం చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా ఏటి మొగ గ్రామానికి చెందిన పొన్నాడ రవిశంకర్ అలియాస్ వీరబాబు 2022వ సంవత్సరంలో ఇరగవరం మండలం అయితంపూడి గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. అప్పటి ఎస్సై కె.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శనివారం తణుకు ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణలో నిందతుడి నేరం రుజువుకావడంతో 14 నెలలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని సీఐ తెలిపారు. పీపీ హనుమంతరావు ప్రాసిక్యూషన్ నిర్వహించగా, ఎస్ఐ డి.ఆదినారాయణ సహకరించారు.