salaar movie: ఇది నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలే!

23 Jun, 2021 20:12 IST|Sakshi

ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్‌’. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియన్‌ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కథా, సినిమా బడ్జెట్‌ దృష్ట్యా ‘సలార్‌’ ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ విషయమై అతను ప్రభాస్‌తో చర్చలు కూడా జరుగుతున్నట్లు  సమాచారం.

సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండు భాగాల ట్రెండ్‌కు ఆదరణ ఉండటంతో ఆ దిశగా చిత్రబృందం కథలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో భారీ బడ్జెట్‌గా రూపొంది రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే దారిలో ‘కేజీఎఫ్‌’ కూడా రెండు భాగాలుగా చిత్రీకరించారు.  ఇక ‘సలార్‌’కు ఇదే తరహా ఫార్ములాను పాటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కథ, క్యాస్టింగ్‌ డిమాండ్‌ బట్టి బడ్జెట్‌ను ఎంతైనా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. అందులో భాగంగానే ప్రస్తుతం హై బడ్జెట్‌ చిత్రాల్ని రెండు భాగాలుగా తెరకెక్కించడం నిర్మాతను కొంత సేఫ్‌ జోన్‌లో పెడుతుందని ఇలా చేస్తున్నాట్లు తెలుస్తోంది. జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన ‘సలార్‌’ చిత్రం ఇటీవల గోదావరిఖని బొగ్గు గనుల్లో ప్రభాస్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంది. ఆ తర్వాత మహమమ్మారి వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరస్‌ కాస్త అదుపులోకి రావడంతో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తి వేయగా, త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: రూ. 150 కోట్ల ఆఫర్లు వదులుకున్న ప్రభాస్‌, ఎందుకో తెలుసా?

  

మరిన్ని వార్తలు