Rajalakshmi Senthil : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న 'సామీ సామీ' సింగర్‌ రాజలక్ష్మీ

30 May, 2023 08:25 IST|Sakshi

నటనకు వయసుతో పనిలేదు అన్నది మరోసారి రుజువైంది. ఒక టీవీ ఛానల్‌ నిర్వహించిన సూపర్‌ సింగర్స్‌ పోటీలో విజేతలుగా నిలిచి కప్పు గెలుచుకున్న దంపతులు సెంథిల్‌, రాజ్యలక్ష్మి. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి గాయకులుగా రాణిస్తున్నారు. కాగా ఇప్పుడు గాయని రాజ్యలక్ష్మి కథానాయకిగా అవతారం ఎత్తారు. ఈమె కథానాయకిగా నటించిన చిత్రం లైసెన్స్‌. జేఆర్‌జీ ప్రొడక్షనన్స్‌ పతాకంపై ఎన్‌. జీవానందం నిర్మించిన ఈ చిత్రానికి గణపతి బాలమురుగన్‌ దర్శకత్వం వహించారు.

ఇందులో రాజ్యలక్ష్మితోపాటు నటుడు రాధారవి, ఎన్‌. జీవానందం, విజయ్‌ భారత్‌, పళ.కరుప్పయ్య, గీత కై లాసం, అభి నక్షత్ర తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. కాశీ విశ్వనాథన్‌ ఛాయాగ్రహణం, బైజు జేకప్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, నిర్మాత టి.శివ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

అదేవిధంగా నిర్మాత జీవానందం ప్లస్‌ టూ క్లాస్‌మెట్స్‌ అయిన 40 మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. కాగా ఈ వేదికపై కథానాయకగా పరిచయం అవుతున్న గాయని రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 32 ఏళ్ల వయసులో ఇద్దరి పిల్లల తల్లి అయిన తాను కథానాయకగా నటిస్తానని ఊహించలేదన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఫోన్‌ చేసి లైసెన్స్‌ చిత్రం కథను చెప్పారన్నారు.

కథ విన్న తర్వాత ఇందులో తాను ఏం చేయాలని అడగ్గా మీరే కథానాయకి అని చెప్పారన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో తాను నటించగలనా అనే సందేహాన్ని వ్యక్తం చేయగా ఈ కథలో ఇతర పాత్రలకు చాయిస్‌ ఉంది గానీ.. కథానాయకి పాత్రకు మీరు తప్ప వేరే చాయిస్‌ లేదని దర్శకుడు చెప్పారన్నారు. ఒక మంచి కథా చిత్రంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు