హైదరాబాద్‌కి అన్నాత్తే

9 Apr, 2021 01:47 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫుల్‌ జోష్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ‘తలైవా (నాయకుడు)ని ఇంత జోష్‌గా చూడడం ఆనందంగా ఉంది’ అంటున్నారు రజనీ అభిమానులు. గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు అస్వస్థత కారణంగా రజనీ ఆస్పత్రిలో చేరిన విషయం, డిశ్చార్జ్‌ అయి చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సినిమా యూనిట్‌లో అప్పుడు నలుగురు కరోనా బారినపడడం వల్ల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.

మూడు నెలలు ఇంటిపట్టునే ఉండి, విశ్రాంతి తీసుకున్న రజనీకాంత్‌ ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి గురువారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్‌లో చిత్రీకరణను ప్లాన్‌ చేశారు. ‘దరువు’ శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్నా షూటింగ్‌ చేసేసి, దీపావళి సందర్భంగా నవంబర్‌ 4న ‘అన్నాత్తే’ని విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు