Renu Desai: కనీసం ఒక్కొక్కరు రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్‌ పోస్ట్‌ వైరల్‌

31 Oct, 2023 17:29 IST|Sakshi

‘బద్రి’చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది నటి రేణూ దేశాయ్‌. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత జానీ(2003) చిత్రంలో నటించి, పవన్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు డేటింగ్‌ చేసిన తర్వాత 2009లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి ఉంటుంది రేణూ. పిల్లల కోసం సినిమాలను దూరం పెట్టింది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో  తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె  సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించింది. మంచి పాత్రలు లభిస్తే..ఇకపై సినిమాల్లో నటిస్తానని కూడా చెప్పింది. దీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు రేణూ దేశాయ్‌కి కథలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా సినిమాల పరంగా కాస్త దూరమైనా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది రేణూ దేశాయ్‌.  మంచి పనులను చేయడానికే సోషల్‌ మీడియాను వాడుతుంటారు. తాజాగా రేణూ తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. 

నా వంతుగా రూ.30 వేలు ఇచ్చా
రేణూ దేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తను పెట్స్‌తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి ఆరోగ్య సమస్యలు వస్తే.. తట్టుకోలేదు. అంతేకాదు పెంపుడు జంతువుల కోసం విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మూడు కుక్కలకు ఆపరేషన్‌ చేయించేందుకు ఓ సంస్థ విరాళాలు అడుగుతోంది. ఆపరేషన్‌కి మొత్తం రూ.55 వేల వరకు ఖర్చు అవుతుందట.

ఈ విషయం రేణూ దేశాయ్‌ దృష్టికి వెళ్లింది. దీంతో తన వంతుగా రూ.30 వేలు విరాళం ఇచ్చి.. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. ‘నేను రూ.30 వేలు సర్దాను.  దయచేసిన మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్‌ తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తి చేసింది. 

మరిన్ని వార్తలు