‘సర్కారు వారి పాట’ టీజర్‌ వాయిదా, కారణం అదేనట!

24 May, 2021 19:06 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చింది మూవీ టీం. ఆ తర్వాత హైదరబాద్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను ప్రారంభించాలనుకున్న మూవీకి కరోనా షాక్‌ ఇచ్చింది. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో షూటింగ్‌ వాయిదా పడింది. ఇదిలా ఉండగా మే 31న మహేశ్‌ తండ్రి కృష్ణ బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ టీజర్‌ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కరోనా కారణంగా టీజర్‌ను విడుదల చేయడం సరికాదని మేకర్స్‌ భావిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వినిపంచాయి. తాజా బజ్‌ ప్రకారం.. టీజర్‌ కట్‌ చేసేందుకు సరిపడ ఫుటేజ్‌ లేదని, అందుకోసమే మూవీ టీం టీజర్‌ విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో 15 రోజుల పాటు జరుపుకున్న ఈ షూటింగ్‌ షెడ్యూల్‌లో కేవలం ఒక యాక్షన్‌ స్వీకెన్స్‌, రెండు సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరిగిందట. అందుకే టీజర్‌ కట్‌ చేసేందుకు సరిపడ సన్నివేశాలు లేకపోవడం వల్లే మూవీ టీం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

అయితే కృష్ణ బర్త్‌డేకు ప్రత్యేకం కోసం టీజర్‌ కాకుండా కేవలం ఓ ఫొటోతో పోస్టర్‌ అయిన విడుదల చేయాలని, లేదంటే ఆ ఒక్క  ఫైట్‌ షాట్‌ను తీసుకుని ఓ చిన్న వీడియో  విడుదల చేయాలనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది 2022కు విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో అనుకున్న తేదీకి ఈ మూవీ విడుదల అవుతుందో లేదో చూడాలి. మహేశ్‌ ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో #SSMB28 సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అనంతరం రాజమౌళి, అనిల్‌ రావిపూడిలతో మహేశ్‌ తదుపరి  సినిమాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు