రియాలిటీ షో ద్వారా సినిమాలో ఛాన్స్‌!

6 Jun, 2021 07:59 IST|Sakshi

శ్రుతి శర్మ.. రియాలిటీ షో విన్నర్‌ కాలేదు.. కానీ రియల్‌ లైఫ్‌లో విన్నర్‌గా నిలిచింది.. సినిమాల్లో, సీరియల్స్‌లో నటించాలనే కలను నిజం చేసుకుని! పుట్టింది, పెరిగింది, చదివింది.. అంతా లక్నోలోనే. చదువుకునేరోజుల్లో డాన్స్, నాటకాల్లో పాల్గొనడంతో నటన మీద ఆసక్తి పెరిగింది. దాంతో విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ముంబైలోని ‘అనుపమ్‌ ఖేర్స్‌ యాక్టింగ్‌ స్కూల్‌’లో చేరి ట్రైనింగ్‌ తీసుకుంది.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. 2018లో ‘ఇండియాస్‌ నెక్ట్స్‌ సూపర్‌స్టార్స్‌’ రియాలిటీ షోతో  చిన్ని తెర ప్రేక్షకులకు పరిచయం అయింది. అందులో తను విజయం సాధించక పోయినా, తన నైపుణ్యంతో ప్రేక్షకులను మెప్పించి ‘స్పెషల్‌ మెన్షన్‌’ అవార్డును అందుకుంది. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ ఆ షో గెస్ట్‌ కరన్‌ జోహార్, తను తీయబోయే సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించడంతో శ్రుతి రియల్‌ విన్నర్‌ అయిందనే  కాంప్లిమెంట్స్‌ పొందింది.  

తెలుగు సినిమా  ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘గఠ్‌బంధన్‌’, ‘నజర్‌ 2’, ‘యే జాదు హై జిన్‌ కా!’, ‘నమక్‌ ఇష్క్‌ కా’ సిరీయల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ‘పగ్లైట్‌’లో ముఖ్య భూమిక పోషించి వెబ్‌ వీక్షకులకూ అభిమాన నటి అయింది. డాన్స్‌ అంటే చాలా ఇష్టం. భరతనాట్యంలో శిక్షణ పొందింది. రచనారంగంలోనూ చేయితిరిగిన వాక్యం, ఎక్స్‌ప్రెషన్‌ ఆమెవి. శ్రుతి రాసిన ‘ప్రిత్యాగ్‌’ అనే నాటకం విమర్శకుల ప్రశసంలు అందుకుంది. ఆ నాటకానికి ఆమె సోదరుడు శగున్‌ శర్మ దర్శకత్వం వహించాడు. 

చిన్నప్పటి నుంచి సినిమాలు, సీరియల్స్‌ చూస్తూ పెరిగా. నటిగా కాకుండా మరేవిధంగానూ  నన్ను నేను ఊహించుకోలేను. సినిమాలే నా జీవితం.
– శ్రుతి శర్మ

చదవండి: ఎమ్మెల్యే శంకర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఫోన్‌

పచ్చందనమే పచ్చదనమే...

మరిన్ని వార్తలు