సినిమాకు ఆభరణం: శ్రుతి లయలే జననీ జనకులు కాగా

4 Feb, 2023 03:30 IST|Sakshi

పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడిన శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన ఆ మహా దర్శకుడు తరలి వెళ్లిపోయాడు. మావి చిగురు తినగానే పలికే కోయిలను కోయిల గొంతు వినగానే తొడిగే మావిచిగురును చూపిన కళాహృదయుడు తన శకాన్ని ముగించాడు. తెలుగు ముగ్గు తెలుగు సిగ్గు తెలుగు కట్టు తెలుగు బొట్టు తెలిసిన తెలుగింటి వనితలు అతను లేక మరి తెరపైకి రారు.

ఒక కీర్తన, తిల్లాన, జావళి, జానపదం గుండె ఝల్లుమనేలా గజ్జె ఘల్లుమనిపించడం మళ్లీ చూడగలమా అతడు చూపినట్టుగా! ఆకలేసినవాడు అమ్మా అని ఎలా అంటాడో
దెబ్బ తగిలినవాడు అమ్మా అని ఎలా అంటాడో తెలియడం చేతనే భావాల లోతును మనసుకు తాకించాడు. నరుడి బతుకు నటనే కావచ్చు. కాని అతణ్ణి తీసుకెళ్లిపోవాలనే ఈశ్వరుడి ఘటన మాత్రం రస హృదయుడైన తెలుగు ప్రేక్షకుడికి బాధాకరం. క్లేశమయం.

► టికెట్లకూ సంతకానికీ లింకు
మద్రాసులో ఒక గవర్నమెంట్‌ ఆఫీసు. ఎవరిదో ఫైల్‌ను ఎవరో ఆఫీసరు సంతకం పెట్టాలి. ఎంతకీ పెట్టడు. ‘ఎంత కావాలో చెప్పమనండీ’ అన్నాడు బాధితుడు. ప్యూన్  పక్కకు తీసుకెళ్లి చెప్పాడు ‘ఆయన డబ్బు తీసుకోడు. స్ట్రిక్టు. శంకరాభరణం టికెట్లు సంపాదించి ఇవ్వగలిగితే ఇవ్వు. పనైపోతుంది’ అప్పటికి నాలుగు వారాలుగా శంకరాభరణం మద్రాసులో తండోపతండాల జనంతో కిటకిటలాడుతోంది. ఆ టికెట్లు దొరికేవి కావు. ఆ ఫైల్‌ సంతకం జరిగేదీ లేదు.

► చంద్రమోహన్‌కు ఆ ప్రాప్తం లేదు
ప్రాప్తం కూడా ఒక మంచిమాటే. శంకరాభరణంలో నటించినందుకు నిర్మాత ఏడిద నాగేశ్వర రావు నటుడు చంద్రమోహన్ కు 50 వేలు రెమ్యూనరేషన్  ఇవ్వాలి. సినిమా బిజినెస్‌ అయితే ఇస్తాడు. బిజినెస్‌ కాదు. షోల మీద షోలు పడుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు. బాగుంది అంటున్నారు. ఎవరూ కొనడం లేదు. ఈ సినిమా రిలీజైతే తప్ప గడ్డం తీయను అని కె.విశ్వనాథ్‌ గడ్డం పెంచుతున్నాడు. గడ్డం పెరుగుతున్నది తప్ప సినిమా రిలీజ్‌ కావడం లేదు.

ఈలోపు ఏడిదకు ఒక ఆలోచన వచ్చింది. చంద్రమోహన్ ను పిలిచి ‘నీ రెమ్యూనరేషన్  బదులు తమిళనాడు రైట్స్‌ ఇస్తాను తీసుకో’ అన్నాడు. చంద్రమోహన్  అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ‘రిలీజ్‌ కాని సినిమా నాకు అంటగడతావా. నా డబ్బు నాకు ఇవ్వు’ అన్నాడు. కొన్ని రోజులకు తమిళ నటి మనోరమ, తమిళనటుడు సౌందరరాజన్ తో శంకరాభరణం ప్రివ్యూ చూసింది. సినిమా అయ్యాక ఉద్వేగంతో విశ్వనాథ్‌ కాళ్ల మీద పడబోయింది. ‘ఈ సినిమా ఒక్కరు చూడకపోయినా పర్వాలేదు. నేను కొంటాను’ అంది. కొన్నది. చంద్రమోహన్ కు ప్రాప్తం లేదు.

► తపస్సు అలా మొదలైంది
1955లో సత్యజిత్‌ రే ‘పథేర్‌ పాంచాలి’ తీశాడు. భారతదేశంలో పార్లల్‌ సినిమాకు అంకురార్పణ చేశాడు. సత్యజిత్‌ రేకు గొప్ప పేరు, ఖ్యాతి దక్కాయి. కాని అది బెంగాలి వాళ్లకు చెల్లింది. హిందీలో కాని, సౌత్‌లో కాని సినిమా వ్యాపార కళ. వ్యాపారం ఎక్కువ, కళ తక్కువ అనుకునే సినిమాలు తీశారు. వినోదం చూపి డబ్బు సంపాదించడమే లక్ష్యం. ఆలోచన, అనుభూతి కృత్రిమ స్థాయి వరకే అంగీకారం. వాస్తవిక వాదంతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల సత్యజిత్‌ రే వేసిన అడుగు పదేళ్ల పాటు బెంగాల్‌ దాటలేదు.

కాని 1973లో ఎం.ఎస్‌.సత్యు తీసిన ‘గరం హవా’ వచ్చింది. అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఆ సినిమాకు జేజేలు పలికారు. శ్యాం బెనగళ్‌ ఆ మరుసటి సంవత్సరమే ‘అంకుర్‌’ తీశాడు. ఇంకోవైపు తమిళంలో కె.బాలచందర్, తెలుగులో దాసరి నారాయణరావు మిడిల్‌ క్లాస్‌ డ్రామాను గట్టిగా పట్టుకున్నారు. 1976లో బాలచందర్‌ ‘అంతులేని కథ’ వచ్చింది. అదే సంవత్సరం దాసరి ‘ఓ మనిషి తిరిగి చూడు’ లాంటి ప్రయోగాత్మక సినిమా తీశారు. అంత వరకు ‘శారద’, ‘జీవన జ్యోతి’ వంటి స్త్రీ కథాంశాలపై దృష్టి పెట్టిన కె.విశ్వనాథ్‌ అంతకు కాస్త అటు ఇటుగా దారి వెతుక్కునే క్రమంలో పడ్డారు. అదే సమయంలో దేశ సంస్కృతిలో వస్తున్న మార్పును చూసి మొత్తుకునే దర్శకులు కూడా వచ్చారు.

1971 లో దేవ్‌ ఆనంద్‌ హిప్పీల వేలంవెర్రిని ‘హరే రామా హరే కృష్ణ’గా తీశాడు. తెలుగునాట చూస్తే వర్తమానంలో సాంస్కృతిక అకాడెమీలు నామ్‌ కే వాస్తేగా మారాయి. తెలుగువాడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ మద్రాసులో అస్థిత్వం పొందాల్సి వచ్చింది. వీటన్నింటి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం కె.విశ్వనాథ్‌ మీద ఉంది. 1976 నాటికి తీసిన ‘సిరి సిరి మువ్వ’ ఆయనకు దారి చూపింది. 1980లో తీసిన ‘శంకరాభరణం’ ఏ పునాది మీద తాను సినిమా తీయాలో, ఏ సంస్కృతి పట్ల తనకు అనురక్తి ఉందో, ఏ ప్రాభవాల కోసం తన గుండె కొట్టుకులాడుతుందో ఆయన తెలుసుకున్నారు.
ఇంతవరకూ చేసింది సినిమా రూపకల్పన.
ఇక మీదట చేయాల్సింది తపస్సు.

► ఆ ముగ్గుర్ని నమ్ముకునే...
‘శంకరాభరణం’ ముహూర్తం రోజున కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తిలను పిలిచి కొత్త బట్టలు పెట్టి ‘మిమ్మల్ని నమ్ముకునే ఈ సినిమా తీస్తున్నాను’ అన్నాడు విశ్వనాథ్‌. నిజమే. అంతకు మించి నమ్ముకోవడానికి సినిమాలో హీరో లేడు. హీరోయినూ లేదు. శంకరశాస్త్రి పాత్రను వేస్తున్నది నాటకాలు వేసుకునే గవర్నమెంట్‌ ఆఫీసరు జె.వి.సోమయాజులు. తులసి పాత్రను వేస్తున్నది వేంప్‌గా ముద్రపడిన మంజుభార్గవి. చంద్రమోహన్ ది సపోర్టింగ్‌ రోల్‌. ఎవరిని చూసి ఈ సినిమా కొనాలి? ఎవరిని చూసి ఈ సినిమా ఆడాలి? పై ముగ్గురినే. కె.వి.మహదేవన్, పుహళేంది, వేటూరి సుందరరామమూర్తి... వీరు విశ్వనాథ్‌ అంచనాని వమ్ము చేయలేదు.

‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము’ అని వేటూరి రాస్తే రిక్షా లాగే కార్మికుడు కూడా శాస్త్రీయ సంగీతం ఆస్వాదించేలా కె.వి.మహదేవన్, పుహళేంది పాటలు చేశారు. శాస్త్రీయ సంగీతం పాడాలంటే శాస్త్రీయ సంగీతం తెలిసిన ఏ మంగళంపల్లో కావాలి. కాని స..ప..స..లు నేర్వలేదని చెప్పుకునే బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. భారతీయ కళలు మరపున పడవచ్చు, మసి బారవచ్చు కాని వాటి తేజస్సు జాజ్వల్యమైనది... వాటి ఆధారంగా ఏర్పడిన పరంపరలు, వ్యక్తిత్వాలు, అహంభావాలు ఎవరికీ తల వంచనివి.. ఎవరు ఏం చేసినా అవి ఒక తరం నుంచి మరో తరానికి ఏదో ఒక మూల కొనసాగుతూనే ఉంటాయి... అని ‘శంకరాభరణం’లో కె.విశ్వనాథ్‌ చెప్పారు. మరి జనం చూస్తారా?

► మొదట ఖాళీ... ఆ తర్వాత కిటకిట
1980 ఫిబ్రవరి 2. అతి కష్టమ్మీద అతి కొద్ది థియేటర్లలో ‘శంకరాభరణం’ రిలీజ్‌ అయ్యింది. నేల, బెంచి, కుర్చీ... ఖాళీ. ఒక దిక్కూ మొక్కూ లేని అమ్మాయి కోసం ఒక మహా విద్వాంసుడు నిలబడ్డాడు. అయినవారు అతణ్ణి వెలి వేశారు. ఈ కథేదో కొత్తగా ఉందే అనుకున్నారు కొందరు. కాలగమనంలో చితికిపోయిన ఒక గొప్ప కళాకారుడు తన అభిజాత్యం కోల్పోకుండా పోరాడుతున్నాడే... ఇదీ బాగుందనుకున్నారు మరి కొందరు.

‘మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు సిరిసిరి మువ్వలు కాబోలు’ శివుని ఎదుట నర్తిస్తున్న ఈ నిష్కళంకుడు ఇంతకు ముందు ఏ కథలోనూ కనిపించలేదే. మొదట కుర్చీ నిండింది. తర్వాత బెంచీ నిండింది. తర్వాత నేల కిటకిటలాడింది. ఆ తర్వాతదంతా చరిత్ర. ‘ఎంటర్‌ ది డ్రాగన్ ’ వచ్చి దేశంలో కరాటే స్కూల్స్‌ తెరిచింది. ‘శంకరాభరణం’ వచ్చి తెలుగునాట సంగీత పాఠాలను, నృత్యపాఠశాలలను పునరుద్ధరించింది.

► దొరకునా ఇటువంటి సేవ!
‘శంకరాభరణం’లో శంకరాభరణ రాగమే లేదు అని విమర్శించాడు మంగళంపల్లి. కె.విశ్వనాథ్‌ భావధార పట్ల ఇలాంటివే కొన్ని అభ్యంతరాలు కొందరికి ఉండవచ్చు. కాని సినిమాను ఒక కళగా, దృశ్య శ్రవణ మాధ్యమంగా, రసస్పందన కలిగించే స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు చూపినవాడు కె.విశ్వనాథ్‌. సినిమాను తపస్సుగా భావించాడు. నిర్వాణ సోపానంగా కూడా.

నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవ

కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన చిత్రాల్లో కొన్ని టైటిల్స్‌తో ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు ఈ విధంగా...

శంకరాభరణం
శంకరుడు అంటే శివుడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వనాథ్‌ సినిమాల్లో దాదాపు శివుడి మీద ఏదో ఒక పాట ఉంటుంది. మరి.. విశ్వ నాథుడు శివభక్తుడా? అంటే... ఆయనకు దైవభక్తి ఎక్కువే. ఏదో ఒక పవర్‌ ఉంటుందనే నమ్మకం ఆయనది. విశ్వనాథ్‌ సినిమాల్లోకి వచ్చాక శివుడి పాట ఉండటం అనేది యాదృచ్ఛికంగా జరిగినదే. అనుకోకుండా ఆ సినిమాలో శివుడికి సంబంధించిన పదమో, సందర్భమో రావడం అనేది భగవదేచ్ఛ అని, కావాలని ప్రయత్నించినది కాదని విశ్వనాథ్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

అంతెందుకు ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రిని విశ్వనాథ్‌ అడిగారు. దేవులపల్లి ఏమో ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతాగంగమ్మ వాన’ అని రాశారు. విశ్వనాథ్‌ ‘శ్రీ’తో రాయమని అడిగారే తప్ప శివుడి మీద రాయమని అడగలేదు. అయినా శివుడి మీద పాట వచ్చేసింది. ఇక చిన్నప్పుడు శివాలయానికి వెళ్లేవారు విశ్వనాథ్‌. ఆ సమయంలో ఒక వ్యక్తి మాస్కు వేసుకుని జడిపిస్తే, మూడు రోజులు జ్వరంతో పడుకున్నారు. అలా తెలిసీ తెలియని వయసు నుంచీ సినిమాల్లోకి వచ్చాక, ఆ తర్వాత కూడా విశ్వనాథ్‌ జీవితంలో శివుడు ఉన్నాడని అర్థమవుతోంది.

అమ్మ మనసు
తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. విశ్వనాథ్‌ది కూడా సేమ్‌ ఫీలింగ్‌. ఇష్ట దైవం ఎవరంటే తన తల్లిదండ్రుల గురించి చెప్పేవారు. అమ్మానాన్నలు చేసిన పుణ్యం, పూజలే ఫలించాయని, కాపాడాయన్నది విశ్వనాథ్‌ నమ్మకం. కళాతపస్వి తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యంకు జ్యోతిష్యం బాగా వచ్చు. అయితే కొడుకు తీసిన ఏ సినిమాకీ ముహూర్తం పెట్టలేదాయన. సినిమా అనేది ఊహకందని వ్యాపారం కాబట్టి తానో ముహూర్తం పెట్టించి, సినిమా ఆడకపోతే ‘ఆయన అనవసరంగా చెప్పారు’ అంటారనే మాట అనిపించుకోవడం ఇష్టంలేక కొడుకు సినిమాలకు ముహూర్తం పెట్టలేదు.

స్వతహాగా మితభాషి అయిన సుబ్రహ్మణ్యం తనయుడి విజయాలకు లోలోపల ఆనందించేవారు. తన పుస్తకాల్లో ‘శంకరాభరణం ఈరోజున ఈ నక్షత్రం, ఈ ఘడియల్లో రష్‌ చూశాను. దీనికి ఈ యోగం ఉంది’ అని రాసుకున్నారు. ఇలా తనయుడి సినిమాల గురించి రాసుకున్నారు. ఇక విశ్వనాథ్‌ తల్లి సరస్వతి అయితే తనయుడి విజయాలను ఆస్వాదించేవారు. సాధారణంగా కోడలు ఇంటికొచ్చాక ఇంటి పరిస్థితి కాస్త మారుతుంది. అయితే కొడుకు మనసు ఎరిగిన తల్లిగా సరస్వతి కోడలిని బాగా చూసుకున్నారు.

చెల్లెలి కాపురం
విశ్వనాథ్‌కి ఇద్దరు చెల్లెళ్లు. పెళ్లయి, చెన్నై వడపళనికి మకాం మార్చినప్పుడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను కూడా తీసుకెళ్లారు విశ్వనాథ్‌. ఆ చెల్లెళ్లు తమకు పెళ్లయ్యేంతవరకూ అన్నా వదిన దగ్గరే ఉన్నారు. తోడబుట్టినవాళ్లను అత్తగారింటికి పంపించాక కూడా వారి బాగోగులను చూసుకున్నారు. వాళ్ల శ్రీమంతాలు, కాన్పులు కూడా చెన్నైలోనే. సోదరుడు తండ్రితో సమానం అంటారు. విశ్వనాథ్‌ తన చెల్లెళ్లకు ఒక తండ్రిలానే ఉన్నారు. అయితే ఆయన సతీమణి జయలక్ష్మి సహకారం లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. విశ్వనాథ్‌ తన సినిమాలతో తీరిక లేకుండా ఉంటే.. ఆడపడుచులను చూసుకున్నారు జయలక్ష్మి. అలాగే చెల్లెళ్లనే కాదు.. తన మేనల్లుళ్లు, మేనకోడళ్లను కూడా బాగా చూసుకున్నారు విశ్వనాథ్‌. చివరికి వాళ్ల పిల్లలు కూడా వీళ్ల ఇంట్లోనే ఉండి, చదువుకోవడం విశేషం.

స్వాతిముత్యం
‘స్వాతిముత్యం’లో శివయ్య (కమల్‌హాసన్‌ పాత్ర పేరు) అమాయకుడు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాడు. మరి.. చిన్నప్పుడు విశ్వనాథ్‌ ఎలా ఉండేవారు అంటే.. మహా అల్లరి. విజయవాడలో చదువుతుండగా కాలువ దాటి స్కూల్‌కి వెళ్లాల్సి వచ్చేది. వీళ్ల ఇంటి ఎదురుగానే కాలువ ఉండేది. వేసవికాలం వచ్చేటప్పుడు కొంచెం నీళ్లే ఉండటంతో బ్రిడ్జి మీద నుంచి కాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి, కాలువలోంచే నడుచుకుంటూ వెళ్లేవారు. అయితే ఇంట్లోవాళ్లకి చెబితే తిడతారని భయం.

నిక్కర్లు పైకి మడుచుకుని కాలువలో దిగిన విశ్వనాథ్‌ని చూసిన ఆయన మేనమామ కూతురు ఇంట్లో విషయం చెప్పేసింది. అంతే.. విశ్వనాథ్‌ తండ్రి అక్కడికి వెళ్లి ‘రేయ్‌’ అని అరిచారు. ఆ భయానికి విశ్వనాథ్‌ చేసిన పనులన్నీ నీళ్లలోనే కలిసిపోయాయి (ఓ సందర్భంలో విశ్వనాథ్‌ నవ్వుతూ చెప్పిన విషయం). అంతే.. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లిన కొడుకుని ‘రాస్కెల్‌’ అని, బట్టలు మార్చుకోమన్నారు విశ్వనాథ్‌ తండ్రి. ఇక ఆ తర్వాత ఆ కాలువ వైపు వెళ్లలేదు. అలాగే చిన్నప్పుడు తండ్రి మూడు చక్రాల సైకిలు కొనిపెడితే, దాన్నే మెర్సిడెస్‌ బెంజ్‌గా ఫీలయి, టింగుటింగుమంటూ బెల్లుకొట్టుకుంటూ వెళ్లేవారు విశ్వనాథ్‌.

స్వయంకృషి
కె. విశ్వనాథ్‌ను ఇంజినీర్‌ చేయాలనుకున్నారు ఆయన తల్లిదండ్రులు. ఆయనకు మాత్రం సంగీతం పై మక్కువ ఎక్కువ. బీఎస్సీ పూర్తి చేశాక తండ్రి అనుమతితో చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా చేరారు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువగా డబ్బింగ్‌ స్టూడియోలు ఉండేవి కావు. దీంతో లొకేషన్‌లోనే ఆర్టిస్టుల మాటలను రికార్డ్‌ చేయవలసి వచ్చేది. సంభాషణలు సరిగ్గా పలకడం తెలియని నటీనటులకు దగ్గరుండి డైలాగులు నేర్పించారు విశ్వనాథ్‌.

‘సౌండ్‌ రికార్డిస్ట్‌’గా నిజాయతీగా చేసిన పని ఆయన్ను సెకండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గా ఎదిగేలా చేసింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకత్వ శాఖలో చేసినప్పుడు విశ్వనాథ్‌ పని తీరు చాలామంది దృష్టిలో పడింది. అలా అక్కినేని నాగేశ్వరరావు ‘ఆత్మగౌరవం’తో దర్శకుణ్ణి చేశారు. అప్పట్నుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ వరకూ రాత్రీ పగలూ తేడా లేకుండా పని చేసిన రోజులే ఎక్కువ. ఆయన స్వయంకృషియే విశ్వనాథ్‌ని తెలుగు పరిశ్రమ శిఖరాగ్రాన నిలిచేలా చేసింది.

శుభప్రదం
దాదాపు 75 సంవత్సరాలు సినిమాలే లోకంగా జీవించారు విశ్వనాథ్‌. ఇక  కుటుంబానికి సమయం కేటాయించాలని దర్శకుడిగా సినిమాలకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అప్పుడప్పుడూ నటుడిగా మాత్రం చేశారు. సినిమాలు తగ్గించాక ఆయన లైఫ్‌స్టయిల్‌ ఎలా సాగిందంటే.. ఉదయాన్నే నిద్ర లేవడం.. అల్పాహారం, భార్యతో కబుర్లు చెప్పుకోవడం, గడిచిన జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఓసారి స్ఫురణకు తెచ్చుకుని హ్యాపీగా ఫీలవ్వడం... ఇలానే విశ్వనాథ్‌ దినచర్య సాగుతుండేది. టీవీల్లో వచ్చే వంటల కార్యక్రమాలను  చూసేందుకు ఇష్టపడేవారు విశ్వనాథ్‌. జయలక్ష్మికి ఏమో ప్రవచనాలు వినడం ఇష్టం. ఉదయం పదకొండు గంటలవరకూ ఆవిడ ఆ కార్యక్రమాలు చూసేవారు.

ఆ తర్వాత రిమోట్‌ విశ్వనాథ్‌ చేతికి దక్కేది. ఇక అప్పుడు ఆయన వంటల ప్రోగ్రామ్స్‌ చూసేవారు. ఇలా కాలక్షేపం చేశారు. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు కాగా, చిన్న కుమారుడికి ఇద్దరు అమ్మాయిలు. ఆయన అల్లుడు, కుమార్తె చెన్నైలో ఉంటారు. వీరికి ఓ పాప. మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా గడిపారు విశ్వనాథ్‌. వయోభారం కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా ఆయన పెద్దగా ఇబ్బంది పడిందిలేదు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘శుభప్రదం’. ఆయన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం కూడా సంపూర్ణం.. శుభప్రదమే. ప్రశాంతంగా వెళ్లిపోయారు కళాతపస్వి.

శుభలేఖ
పందొమ్మిదేళ్లకే విశ్వనాథ్‌కి పెళ్లయింది. రెండు పెళ్లి చూపులకు వెళ్లారు. ఒకటి ఆయన మేనమామ తెచ్చిన పెళ్లి సంబంధం. అప్పటికే చెన్నైలో ఉంటున్న విశ్వనాథ్‌ ఆ సంబంధం కోసం తెనాలి వెళ్లారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత రెండో పెళ్లి సంబంధం కోసం చెన్నై వెళ్లి, అక్కడ జయలక్ష్మిని చూశారాయన. ఆ సంబంధం ఖాయం అయింది. అప్పటికి జయలక్ష్మికి 14 సంవత్సరాలు. చిన్న వయసులో అత్తింట్లో అడుగుపెట్టిన జయలక్ష్మి ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఇద్దరు ఆడపడుచులు, అత్తమామలు, వచ్చే పోయే బంధువులతో జయలక్ష్మికి క్షణం తీరిక ఉండేది కాదు. పైగా విశ్వనాథ్‌ చేసినవి ఎక్కువగా రిస్కీ ప్రాజెక్ట్స్‌ కాబట్టి నిర్మాతల దగ్గర పారితోషికం ఇంత కావాలని డిమాండ్‌ చేయలేకపోయారు.

పెద్ద స్థాయిలో పారితోషికం కూడా వచ్చేది కాదు. దీంతో దర్శకుడిగా మారిన పదేళ్ల తర్వాతే కారు కొనగలిగారు. అలాగే ఫలానా నగ బాగుందని భర్తతో జస్ట్‌ అనేవారు కానీ ఏనాడూ నాకిది కావాలని జయలక్ష్మి అడిగింది లేదు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటుటారు. నా విజయం వెనక నా భార్య జయలక్ష్మి ఉంది. సినిమా పనులతో నేను బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నా తరఫు బంధువులందరూ నాకన్నా ఎక్కువగా తననే అభిమానిస్తుంటారు. అంత ఆప్యాయంగా జయలక్ష్మి వారిని చూసుకుంటుంది’ అని భార్య గొప్పతనం గురించి పలు సందర్భాల్లో చెప్పారు విశ్వనాథ్‌. భర్తని అర్థం చేసుకున్న జయలక్ష్మి, భార్యని అర్థం చేసుకున్న భర్తగా ఈ దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా సాగింది.

బాలూ అలిగితే నటుడయ్యాడు
కె.విశ్వనాథ్‌ ప్రాథమికంగా నటుడు. కాని దాసరిలాగా విశ్వనాథ్‌ తన సినిమాల్లో పాత్రలు చేయలేదు. బాలూ వల్ల చేయాల్సి వచ్చింది. ‘శుభ సంకల్పం’ సినిమాకు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్మాత. గొల్లపూడి, విశ్వనాథ్‌ కలిసి స్క్రిప్ట్‌ తయారు చేశారు. కమల హాసన్‌ హీరో. హీరోయిన్‌గా ఆమని. స్క్రిప్ట్‌ రాసేటప్పుడే ఫలానా పాత్రకు ఫలానా అని రఫ్‌గా భావిస్తూ రాసుకున్నారు– ఒక్క రాయుడు పాత్రకు తప్ప. అది సినిమాలో కమలహాసన్‌కు యజమాని పాత్ర. సరే... స్క్రిప్ట్‌ను బాలూకు చదివి వినిపించే రోజు వచ్చింది.

విశ్వనాథ్‌ స్వయంగా చదివి వినిపిస్తూ ఒక సన్నివేశంలో రాయుడు ఎలా ఆవేదన చెందుతాడో గాద్గదికంగా చదివి వినిపించారు. బాలూకు ఆ పాత్రలో విశ్వనాథే కనిపించారు. గొల్లపూడికి చెప్తే ఆయన కూడా వత్తాసు పలికాడు. అదే ప్రస్తావన విశ్వనాథ్‌ దగ్గర తెస్తే ‘నేనేమిటి... నటించడం ఏమిటి’ అని తిరస్కరించారు. నటించాల్సిందే అని బాలు పట్టుపట్టాడు. నటించను అని విశ్వనాథ్‌ గట్టిగా చెప్పేశారు. బాలు అలిగి స్క్రిప్ట్‌ ఫైల్‌ విసిరి కొట్టి అలా అయితే సినిమానే చేయను అని వెళ్లిపోయాడు. చివరకు విశ్వనాథ్‌ బాలు కోరికను మన్నించారు. ‘శుభ సంకల్పం’ విడుదల తర్వాత హఠాత్తుగా తెలుగు వెండితెరకు మరో కేరెక్టర్‌ ఆర్టిస్టు దొరికినట్టయ్యింది.

మరిన్ని వార్తలు