Taapsee Pannu: వాళ్లు ఇండస్ట్రీకి హాని చేయాలని చూసే మూర్ఖులు

20 Aug, 2022 21:25 IST|Sakshi

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దొబారా. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 19న రిలీజైంది. సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్‌ లేవంటూ పలువురు సినీవిశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే కమల్‌ రషీద్‌ ఖాన్‌ (కేఆర్‌కే) మాత్రం ఓ అడుగు ముందుకేసి తాప్సీపై, ఆమె సినిమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్‌ అయిన తాప్సీ దొబారా మూవీ 215 స్క్రీన్స్‌లో రిలీజైంది. జనాలు లేకపోవడంతో మార్నింగ్‌ షోలు రద్దయ్యాయంటూ నవ్వుతున్న ఎమోజీలు యాడ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. దొబారా మూవీకి ఎక్కడ చూసినా హౌస్‌ఫులే, కానీ కలెక్షన్లు మాత్రం ఎనిమిది లక్షలే వచ్చాయంటూ సెటైర్‌ వేస్తూ ట్వీట్‌ చేశాడు. అలాగే రోహిత్‌ జైస్వాల్‌ అనే రివ్యూయర్‌ సైతం 'కోల్‌కతాలో ఒకరోజు హల్దిరామ్స్‌ స్వీట్స్‌ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో దొబారా సినిమా ఫస్ట్‌డేకి కూడా అంత కలెక్షన్లు రాలేదు' అని విమర్శించాడు.

అయితే హన్సల్‌ మెహతా అనే సినీ విశ్లేషకుడు వీరి మాటలను తప్పుపట్టాడు. 'దొబారా 370 స్క్రీన్లలోనే రూ.72 లక్షలు వసూలు చేసింది. ఇదేం చిన్న విషయం కాదు. కానీ విశ్లేషకులం అని చెప్పుకునే మీలాంటివారే సినిమాకు నష్టాన్ని కలగజేస్తున్నారు' అని రిప్లై ఇచ్చాడు. దీనికి తాప్సీ స్పందిస్తూ.. 'సర్‌, ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు వల్లెవేసినా అది నిజం కాలేదు. కేవలం సినిమాల గురించి మాట్లాడుతూ పేరు తెచ్చుకున్న ఇలాంటివారు ఇండస్ట్రీకి హాని తలపెట్టాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. వాళ్లెంత మూర్ఖులో చూడండి. అయినా ఇలాంటివాళ్లకు దొబారా సినిమా అర్థం కావడం కొంత కష్టమేలెండి. దానికి మనమేం చేయగలం చెప్పండి' అని ట్విటర్‌లో చురకలంటించింది.

చదవండి: బస్సు డ్రైవర్‌ అసభ్యంగా తాకాడు: సీఎంలను ట్యాగ్‌ చేసిన నటి

మరిన్ని వార్తలు