ఫేషియల్‌ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్‌

18 Apr, 2021 15:54 IST|Sakshi

ఆడవాళ్లు అందానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అందులోనూ నటీమణుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేషియల్స్‌ అని, సర్జరీలు అని అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు నానాతంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో ముఖం మీద చిన్న గీత పడినా విలవిల్లాడిపోతుంటారు.. అయితే తాజాగా ఫేషియల్‌కు వెళ్లిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడం కాదు కదా, ఉన్న సహజత్వాన్ని నాశనం చేస్తూ ఆమెను అందవికారంగా మార్చిందో డాక్టర్‌.

తమిళ నటి రైజా విల్‌సన్‌ సాధారణ ఫేషియల్‌ కోసం ఓ క్లినిక్‌కు వెళ్లింది. కానీ అక్కడి మహిళా డాక్టర్‌ చర్మానికి మరింత నిగారింపు తీసుకొస్తానంటూ బలవంతంగా ఆమెకు చర్మ చికిత్స చేసింది. దీంతో అది వికటించి నటి కన్ను కింద వాచిపోయింది. అది ఉబ్బిపోయి ముఖారవిందాన్ని దెబ్బ తీస్తోంది. దీంతో భంగపాటుకు గురైన నటి.. "నాకు అవసరం లేకపోయినా డాక్టర్‌ భైరవి‌ నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చింది.. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోంది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారు" అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో యాడ్‌ చేసింది. 'డా.భైరవి తనదగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది' అంటూ పలువురు నెటిజన్లు వాపోయారు. దీంతో తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారని తెలిసి నటి షాక్‌కు గురైంది.

కాగా రైజా 2017లో 'వెలయ్యిలా పట్టధారి 2' సినిమాలోని ఓ చిన్నపాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ పాల్గొంది. 2018లో 'ప్యార్‌ ప్రేమ కాదల్‌' సినిమాతో హీరోయిన్‌గా మారింది. దీనికిగానూ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సైతం అందుకుంది. ప్రస్తుతం ఆమె 'అలైస్'‌, 'కాదలిక్క యారుమిల్లై', 'హ్యాష్‌ట్యాగ్‌ లవ్‌' అనే సినిమాలు చేస్తోంది.

చదవండి: ఎన్టీఆర్‌ పుట్టిన రోజుకి కొత్త కబురు

మెగాస్టార్‌ సినిమాను రిజెక్ట్‌ చేసిన బాలీవుడ్‌ దర్శకుడు

మరిన్ని వార్తలు