OTT: అక్టోబరు 30లోపు ఓటీటీకి సినిమాలు అమ్ముకోవద్దు

3 Jul, 2021 18:54 IST|Sakshi

అప్పటి వరకు ఓటీటీకి సినిమాలు అమ్ముకోవద్దు: ఎగ్జిబిటర్ల తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌చాంబర్‌ ప్రతినిధులు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో.. నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంకి ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో... జూలై చివరినాటికి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉన్నందున అక్టోబర్‌ 30 వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. తొందరపడి సినిమాలను అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. 

ఈ సందర్భంగా... నిర్మాతలు సినిమాలను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో ప్రదర్శించడం అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విభాగాన్ని దెబ్బతీయడమేనని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయపడింది. తమ విజ్ఞప్తిని ఖాతరు చేయని నిర్మాతల పట్ల భవిష్యత్తులో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూలై 7న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ బాడీ సమావేశం జరపాలని నిర్ణయం తీసుకుంది. సినీ పరిశ్రమ విస్తృత ప్రయోజనాల రీత్యా నిర్మాతలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు