నా సినిమాను అడ్డుకుంటున్నారు.. ప్రాణహానీ ఉంది: నిర్మాత ఫిర్యాదు

18 Oct, 2022 10:15 IST|Sakshi

తాను నిర్మిస్తున్న సినిమాను వివిధ కారణాలతో ఆపేందుకు ప్రయత్నించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిసీ దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాలు.. నల్లకుంటలో నివసించే మంచాల ప్రమోద్‌(27) సినిమాలు నిర్మించేందకు గాను శ్రీనగర్‌ కాలనీకి వచ్చి సొంత బ్యానర్‌పై ‘కంటోన్మెట్‌ పోస్టాఫీస్‌’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే నీకు ఎందుకంటూ బాల సతీష్‌, రాజేష్‌ చిలువురి అనే ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తూ తనను సినీ పరిశ్రమ నుంచి దూరం చేసేందుకు యత్నించడమే కాకుండా తన సినిమా నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తూ ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

గణపతి కాంప్లెక్స్‌ వద్ద తనతో పాటు సహాయ దర్శకుడు బి. రవితేజపై కూడా కులం పేరుతో దుషించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సతీష్‌, రాజేష్‌ చిలువూరిలపై బంజారాహిల్స్‌ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు