నిరుద్యోగి వినూత్న ప్రచారం

11 Nov, 2023 06:38 IST|Sakshi
కారు గుర్తుకు ఓటు వేస్తే.. బిచ్చమెత్తుకోవడమే అంటూ ప్రచారం నిర్వహిస్తున్న సత్యనారాయణ

చండూరు : ‘కేసీఆర్‌కు ఓటు వేయకండి.. ఒకవేళ వేశారో బిచ్చమెత్తుకోవడం (నా వేశాధారణ) ఖాయం. చెత్తులెత్తి దండం పెడుతున్నా కేసీఆర్‌కు ఓటు వద్దు’ అంటూ ఓయూ పీహెచ్‌డీ స్కాలర్‌, మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ నల్లగొండ జిల్లా చండూరు పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

శుక్రవారం చిరిగిన చొక్కా, చినిగిన చిన్న లుంగీ, నెత్తికి గుడ్డ రుమాలు ధరించి, ఫ్ల కార్డులు, రెండు ఖాళీ బీరు సీసాలు, చేతిలో చిప్ప పెట్టుకొని ఓటర్లను అడుక్కుంటూ చండూరులోని నామినేషన్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లిక్కర్‌కు ఎలాంటి లిటికేషన్‌లు ఉండవు.. ఉద్యోగాలకు అన్ని లిటికేషన్లే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో అనేక ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల లాగా మన మునుగోడు ఎందుకు అభివృద్ధి జరుగడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. రైతులు, వృద్ధులు మోసపోకండి.. మోసపోతే అందరం బిచ్చమెత్తుకోవాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 92 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం అటుంచితే.. 9 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. అనంతరం ఆయన మునుగోడు అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

 

మరిన్ని వార్తలు