షార్టసర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమై భారీ నష్టం

3 Dec, 2023 12:02 IST|Sakshi
దగ్ధమైన ఇల్లు

భువనగిరి క్రైం: షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన పట్టణంలోని కిసాన్‌నగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కిసాన్‌నగర్‌కు చెందిన మోట శ్రీశైలం కుటుంబంతో కలిసి కర్నాటక రాష్ట్రానికి పనినిమిత్తం వెళ్లాడు. తాళం వేసిన ఇంట్లో శనివారం రాత్రి షార్ట్‌సర్క్యూట్‌ జరిగి అగ్నిప్రమాదం సంభవించడంతో ఇల్లు దగ్ధమై ఇంట్లోని సిలిండర్‌ పేలడంతో భారీ నష్టం వాటిల్లింది.

దీంతో స్థానికులు ఫైర్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇల్లు మొత్తం కాలిపోయింది. పట్టణంతో పాటు, మండలంలో రెండు రోజుల నుంచి విద్యుత్‌ సరఫరాతో తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
శాలిగౌరారం:
లారీ ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ సమీపంలో 365వ నంబర్‌ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన బాలెం వెంకన్న(45) శనివారం రాత్రి నకిరేకల్‌ నుంచి 365వ నంబర్‌ జాతీయ రహదారి మీదుగా చిత్తలూరుకు బైక్‌పై వెళ్తున్నాడు.

ఈ క్రమంలో పెర్కకొండారం గ్రామ సమీపంలోకి రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్‌ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు.

మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బొలేరో వాహనం బోల్తా.. పలువురికి గాయాలు
మిర్యాలగూడ:
బొలెరో వాహనం బోల్తా పడగా.. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన దామరచర్ల మండల కేంద్రం శివారులో శనివారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్లలోని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో కూలీలుగా పనిచేస్తున్న సుమారు 16 మంది విధులు ముగించుకుని బొలేరో వాహనంలో దామరచర్లకు వస్తుండగా వీర్లపాలెం రహదారిలో ముత్యాలమ్మ గుడి మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు బిహార్‌ రాష్ట్రానికి చెందిన కూలీలుగా పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు