గూఢచర్యం కేసు: భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!

26 Oct, 2023 17:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష విధించారు.   గురువారం  ఖతార్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత  విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది.

ఖతార్‌ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. 

గూఢ‌చ‌ర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్‌ చేసి జైలులో ఉంచారు. ఇండియ‌న్ నేవీకి చెందిన‌ 8 మందితో పాటు ఖ‌తార్‌కు చెందిన మ‌రో ఇద్ద‌రిపై కూడా గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎల‌క్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్న‌ట్లు ఖ‌తార్ అధికారులు వాదన. వీరి బెయిల్‌  పిటీషన్లను పలుమార్లు  తిరస్కరించింది.  ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు   సంచలనం రేపుతోంది. 

నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్‌ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్‌కు అందించా రనేది వారి ఆరోపణ.  ఖతార్‌ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్‌ కంపెనీ సీఈవోను, ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ సైనిక  కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్‌ చేసింది. 

వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా  జైల్లోనే ఉన్నారు.  మరణశిక్షను  ఎదుర్కొంటున్న వారిలో  కెప్టెన్‌ నవతేజ్‌సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కెప్టెన్‌ సౌరభ్‌ వశిష్ట్‌, అమిత్‌నాగల్‌, పురేందు తివారి, సుగుణాకర్‌  పాకాల, సంజీవ్‌ గుప్తా, సెయిలర్‌ రాజేశ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు