హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు

16 Feb, 2023 08:15 IST|Sakshi

న్యూఢిల్లీ: గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో అవకతవకలపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం మరో పిటిషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌ దీన్ని దాఖలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో దర్యాప్తుకు ఆదేశించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహల ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి. కేసును అత్యవసరంగా విచారించాలని లాయర్‌ కోరారు. దీంతో కేసును ఈనెల 24వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

అయితే ఈ అంశంపై ఇప్పటికే నమోదైన మరో రెండు కేసుల విచారణ 17వ తేదీన ఉండటంతో అదే రోజున దీనినీ విచారించాలని జయా ఠాకూర్‌ తరఫు లాయర్‌ చెప్పారు. అందుకు సమ్మతిస్తూ, ఈనెల 17వ తేదీనే విచారిస్తామని కోర్టు స్పష్టంచేసింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ వ్యవస్థల బలోపేతానికి నిపుణుల మండలిని ఏర్పాటు చేయాలన్న కోర్టు సిఫార్సులను కేంద్రం అంగీకరించడం తెలిసిందే.
చదవండి: ‘మీ బుల్డోజర్లతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్‌’ యోగి సర్కార్‌పై యూపీ మాజీ సీఎం ఫైర్‌

మరిన్ని వార్తలు