రాజకీయ విభేదాలు నడుమ దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రియా సూలే

16 Nov, 2023 12:14 IST|Sakshi

ముంబై: రాజకీయ విభేదాల నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణె జిల్లాలోని బారామతిలో 'భౌ బీజ్' (భాయ్ దూజ్) వేడుకలను జరుపుకున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, వారి కుమారులు పార్థ్ పవార్, జే పవార్‌తో పాటు మిగిలిన పవార్ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ప్రతి ఏడాది పవార్ కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా భాయ్ దూజ్ వేడుకలు జరుపుకుంటారు. భాయ్ దూజ్ వేడుకలు అన్న చెల్లెల్ల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని పేర్కొంటూ సుప్రియా సూలే ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోలను పంచుకున్నారు.     

రాజకీయ మనస్పర్ధల మధ్య ఈసారి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉన్నాయా? అని సుప్రియా సూలేను అడిగినప్పుడు.. 'వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ భిన్నమైన విషయాలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే మేము భాయ్ దూజ్ పండుగను జరుపుకోవడానికి అజిత్ పవార్ నివాసానికి వెళ్లాము. వ్యక్తిగతమైన కక్షలు ఎవరితోనూ ఉండవు' అని అమె అన్నారు. 

ఈ ఏడాది ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో అజిత్‌ పవార్ చేతులు కలిపారు. అటు నుంచి ఎన్సీపీలో శరద్‌ పవార్‌కు అజిత్ పవార్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్‌తో కలిసి దీపావళి పండగ వేళ వేడుక చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఇదీ చదవండి: బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా?

మరిన్ని వార్తలు