వాడీ వేడిగా ఉప ఎన్నికలు.. ఏడులో మూడు అక్కడే!

5 Dec, 2022 07:52 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్‌ పోలింగ్‌.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఏడు చోట్ల సైతం ఉప ఎన్నికల పోలింగ్‌ ఇవాళే(డిసెంబర్‌ 5, సోమవారం) జరగనున్నాయి. ఇందులో ఒక లోక్‌సభ స్థానం సైతం ఉంది. 

రాజస్థాన్‌(సర్దార్‌షాహర్‌), ఛత్తీస్‌గఢ్‌(భానుప్రతాప్‌పూర్‌), ఒడిశా(పదంపూర్‌)లలో సిట్టింగ్‌ క్యాండిడేట్‌ల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీహార్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అనర్హత వేటు కారణంగా ఖుర్‌హని స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్డీయే కూటమికి సీఎం నితీశ్‌కుమార్‌ గుడ్‌ బై చెప్పిన తర్వాత జరుగుతున్న.. మొదటి ఎన్నిక ఇది. 

ఇక మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం ఎన్నికతో ఉత్తర ప్రదేశ్‌ ప్రధాన చర్చకు దారి తీసింది. సమాజ్‌వాదీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ములాయం కంచుకోట అయినప్పటికీ.. కిందటిసారి జరిగిన ఎన్నికలో తక్కువ మార్జిన్‌తో గెలుపుతో గెలుపొందారు ములాయం. దీంతో ఎస్పీ గెలుపు అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. 

ఎస్పీ తరపున అఖిలేష్‌ యాదవ్‌ భార్య, ఆయన కోడలు డింపుల్‌ యాదవ్‌ పోటీలో దిగారు. ఇక బీజేపీ మాజీ ఎంపీ రఘురాజ్‌ సింగ్‌ శక్య ఈసారి బరిలో నిల్చున్నారు. 

యూపీలోనే రాంపూర్‌ సదర్‌, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్‌ 8వ తేదీన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ఈ  ఉప ఎన్నికల ఫలితాలను సైతం వెల్లడించనుంది ఎన్నికల సంఘం.

మరిన్ని వార్తలు