హిందువులు చర్చికెళ్తే ఖబడ్దార్‌..

5 Dec, 2020 18:59 IST|Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బజరంగ్‌ దళ్‌ నేత

డిస్పూర్‌‌: ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు.. యువతీయువకులు బయట జంటగా కనిపిస్తే.. పెళ్లి చేస్తాం అని బెదిరించే బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు తాజాగా క్రైస్తవుల పవిత్ర పర్వదినం క్రిస్టమస్‌ మీద పడ్డారు. హిందువులు ఎవరైనా క్రిస్టమస్‌ నాడు చర్చికి వెళ్తే చితకబాదుతాం జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్‌ జనరల్‌ సెక్రటరీ మిథు నాథ్‌ అస్సాం కాచర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాథ్‌ ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం.. కొన్ని రోజుల క్రితం క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న మేఘలయాలో వివేకానంద సెంటర్‌ని మూసి వేశారు. ఆ కోపంతో నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రైస్తవులు మన పవిత్ర పుణ్యక్షేత్రాలను మూసి వేశారు. ఈ స్థితిలో ఎవరైనా హిందువులు, చర్చికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో మేం చాలా సీరియస్‌గా ఉ‍న్నాం’ అన్నారు. ( సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!)

అంతేకాక ‘మా మాటలు కాదని ఎవరైనా చర్చికెళితే.. మేం వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత రోజు పేపర్లో మేం హెడ్‌లైన్స్‌లో నిలుస్తాం. "గుండాదళ్" ఓరియంటల్ పాఠశాలను ధ్వంసం చేసింది.. అని పేపర్‌లో వస్తుంది. కాని అది మా ప్రాధాన్యత కాదు.  షిల్లాంగ్‌లోని క్రైస్తవులు మన దేవాలయాల ద్వారాలను లాక్ చేస్తున్నప్పుడు హిందువులు వారి కార్యక్రమాలలో పాల్గొనడాన్ని మేం అనుమతించము’ అని మిథు నాథ్‌ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ఖాసీ విద్యార్థి సంఘం రామకృష్ణ మిషన్‌ ఆలయాన్ని మూసివేసింది అని తెలిపారు. అయితే, ఈ వాదనను మేఘాలయ ప్రభుత్వ ఉన్నతాధికారి ఖండించినట్లు సమాచారం. డిస్ట్రిక్‌ హాలీడే కావడంతో సాంస్కృతిక కేంద్రం మూసివేశారని.. లాక్‌ చేయలేదని సదరు అధికారి తెలిపారు. 
 

మరిన్ని వార్తలు