ఆ సమయంలో ఏది సరైందో అదే చేశా!: మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

11 May, 2023 21:29 IST|Sakshi

మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు నాటి మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ భగత్‌ సింగ్‌​ కోష్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి గవర్నర్‌ 80 ఏళ్ల భగత్‌ సింగ్‌ కోష్యారీని మీడియా ప్రశ్నించగా..నన్ను శిక్షించిందని అనుకోవడం లేదని తెలివిగా సమాధానమిచ్చారు. కారణం తాను రాజీనామా చేశానని, మాజీ గవర్నర్‌కు శిక్ష విధిస్తారని తాను అనుకోవడం లేదంటూ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు.

ఒక వేళ శిక్ష విధిస్తే తాను అప్పీల్‌ చేసి ఉండేవాడినంటూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కోష్యారీ. ఐతే తాను ఆ సమయంలో ఏది సరైనదో అదే చేశానని అన్నారు. అయినా సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అని సెటైరికల్‌ సమాధానమిచ్చారు. పైగా సుప్పీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా తప్పించుకునే థోరణితో సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉండగా, నాటి ఘటనలో ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు వచ్చేయడం కూడా సరికాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. పైగా గవర్నర్‌ అలా నిర్ణయించడం రాజ్యంగ విరుద్ధమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కూడా రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. మాజీ సీఎం థాక్రే బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారని అందువల్లే ప్రభుత్వాన్ని పునురుద్ధరించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కాగా, నాటి గవర్నర్‌ కోష్యారీ మాత్రం తన నిర్ణయం గురించి ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. 

(చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం: సుప్రీం కోర్టు)

మరిన్ని వార్తలు