World Cup Final Match: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్‌ చూసే అవకాశం!

19 Nov, 2023 09:35 IST|Sakshi

ఈరోజు(ఆదివారం) ఉత్తరాదిన మహిళలు భర్త క్షేమం కోరుతూ ఛత్‌ వ్రతం చేస్తున్నారు. దీనిలో భాగంగా నేటి సాయంత్రం వేళ నదిలో నిలుచుని సూర్యునికి అర్ఘ్యమివ్వనున్నారు. మరోవైపు ఈ రోజు క్రికెట్‌ ప్రపంచ కప్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపధ్యంలో అటు ఛత్‌ పూజలో పాల్గొని, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు అదే సమయంలో భారీ స్క్రీన్‌పై క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించే అవకాశం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌వాసులకు దక్కింది.

టీమ్‌ ఇండియా ఫైనల్‌కు చేరుకోగానే దేశంలోని క్రికెట్‌ అభిమానులు ఉత్సాహం అంబరాన్ని తాకింది. ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానికులు అటు ఛత్‌ పూజలో పాల్గొంటూ, అదే సమయంలో ప్రపంచకప్‌ ఫైనల్‌ ‍మ్యాచ్‌ చూసేందుకు వివిధ గంగా ఘాట్‌ల  వద్ద భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. 

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ఒడ్డున సూర్య భగవానుని విగ్రహం దగ్గర భారత జట్టు పోస్టర్‌లను ఏర్పాటు చేశారు. టీమ్ ఇండియా విజయం కోరుతూ భక్తులు రామాయణ పారాయణం కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఛత్ పూజ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది ఒడ్డున ఛత్ పూజా మండపం ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి మండపంలో భారత జట్టు పోస్టర్లను కూడా ఉంచారు. దీంతో ఇక్కడి పూజలు నిర్వహిస్తున్నవారంతా భారత్‌ విజయం కోసం కూడా ప్రార్థనలు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’

మరిన్ని వార్తలు