మేరా యువ భారత్‌ వేదికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

12 Oct, 2023 05:52 IST|Sakshi

న్యూఢిల్లీ: యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం  మేరా యువ భారత్‌ (మై భారత్‌) అనే స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో యువతలో నైపుణ్యాల అభివృద్ధి, నాయకత్వ లక్షణాల పెంపు కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విలేకరులకు వెల్లడించారు.

అక్టోబర్‌ 31న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఈ సంస్థను జాతికి అంకితం చేయనున్నారు. యువతలో నైపుణ్యాలను, ఆకాంక్షాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తుందన్నారు. మరోవైపు కేబినెట్‌ సమావేశంలో కొన్ని ఖనిజాలకు సంబంధించిన రాయల్టీ రేట్లను నిర్ణయించారు. లిథియం, నియోబియం ఖనిజాలకు 3%, అరుదుగా లభించే రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ (ఆర్‌ఈఈ)లకు ఒక్క శాతం రాయల్టీ నిర్ణయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు