గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.19,744 కోట్లు

5 Jan, 2023 05:02 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఈ ఏడాది రూ.19,744 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. కేబినెట్‌ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కేబినెట్‌ వివరాలను విలేకరులకు వెల్లడించారు. నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని తాము భావిస్తున్నట్టుగా చెప్పారు. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు  తెలిపారు.

ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.20 వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో దాని ధర తగ్గుతుందని అన్నారు. కార్బన్‌ రహిత హైడ్రోజన్‌ను ఆటోమొబైల్స్‌ , ఆయిల్‌ రిఫైనరీలు, స్టీల్‌ ప్లాంట్లలో ఇంధనంగా వినియోగించవచ్చునని ఠాకూర్‌ చెప్పారు. ఈ మిషన్‌ కోసం ప్రాథమికంగా రూ.19,744 కోట్లు కేటాయించామని, స్ట్రాటజిక్‌ ఇంటర్‌వెన్షన్స్‌ ఫర్‌ గ్రీన్‌ హైబ్రోజన్‌ ట్రాన్సిషన్‌ (సైట్‌) కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, ఫైలెట్‌ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కి రూ.400 కో ట్లు, ఇతర అవసరాల కోసం రూ.388 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్‌ అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ మిషన్‌ సాకారమైతే ఇంధన రంగంలో భారత్‌ స్వయంప్రతిపత్తిని సాధిస్తుంది.

మరిన్ని వార్తలు