రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..! కేంద్రం కీలక నిర్ణయం

4 Dec, 2023 21:10 IST|Sakshi

ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందేలా నూతన విధానాన్ని రూపొందించింది. మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.

“ప్రమాదంలో గాయపడిన బాధితులకు  నగదు రహిత వైద్య చికిత్స అందించడం మోటారు వాహన చట్టం 2019 సవరణలో భాగం. కొన్ని రాష్ట్రాలు దీనిని ఇప్పటికే అమలు చేశాయి. అయితే ఇప్పుడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి రోడ్ల మంత్రిత్వ శాఖ దీనిని దేశవ్యాప్తంగా పూర్తిగా అమలు చేయనుంది” అని రోడ్డు రవాణా, హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ చెప్పారు.

సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే దీని ఉద్దేశమని అనురాగ్ జైన్ తెలిపారు. గోల్డెన్‌ అవర్‌ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేస్తామన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఇది అందుబాటులోకి రానుందన్నారు.

ఇదీ చదవండి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!?

>
మరిన్ని వార్తలు