రెమ్‌డెసివిర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న కేంద్రం

29 May, 2021 15:05 IST|Sakshi

న్యూఢిల్లీ : రెమ్‌డెసివిర్‌ ఔషధం పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ప్రస్తుతం రెమ్‌డెసివిర్‌ రోజువారీ ఉత్పత్తులు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌ మంత్రి మన్‌సుఖ్‌ మందావియా ప్రకటన చేశారు. ఇకపై రెమ్‌డెసివర్‌ పంపిణీ బాధ్యతలను పర్యవేక్షించాల్సిందిగా నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ ఏజెన్సీ, సీడీఎస్‌సీవోలను ఆయన ఆదేశించారు.

అప్పుడు కీలకం

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు చికిత్సలో రెమ్‌డెసివిర్‌ ఔషధం కీలకంగా మారింది. ఏప్రిల్‌ 15 నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ రోజు 33,000 రెమ్‌డెసివిర్‌ వాయిల్స్‌ తయారయ్యేవి. మరోవైపు డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. దీంతో మే 8 నుంచి రెమ్‌డెసివర్‌ తయారీ కంపెనీల నుంచి కేంద్రం నేరుగా  ఔషధాలను కొనుగోలు చేసేది. కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రాలకు ఈ ఔషధాన్ని పంపిణీ చేస్తూ వచ్చింది. 
పెరిగిన ఉత్పత్తి
రెమ్‌డెసివిర్‌ కొరత అధిగమించేందుకు ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్యను 20 నుంచి 60కి పెంచారు. దీంతో రెమ్‌డెసివిర్‌ ఔషధాల ఉత్పత్తి రోజుకు 33 వేల నుంచి 3.50 లక్షల వాయిల్స్‌కి పెరిగింది. దీంతో రెమ్‌డెసివిర్‌ పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ఇప్పటి వరకు కేంద్రం 53 లక్షల వాయిల్స్‌ని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది. ఇటీవల కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ మందును ఐసీఎంఆర్‌ తొలిగించింది.

మరిన్ని వార్తలు