‘ఢిల్లీ లిక్కర్‌ స్కాం: నిజాలు బయటపడతాయ్‌.. నెక్ట్స్‌ అరెస్ట్‌ అరవింద్‌ కేజ్రీవాల్’

10 Mar, 2023 16:22 IST|Sakshi

మనీలాండరింగ్ కేసులో శుక్రవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో సుకేశ్‌ చంద్రశేఖర్ హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుకేశ్‌.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తదుపరి అరెస్ట్‌ అరవింద్ కేజ్రీవాల్‌దే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రశేఖర్ గతంలో కేజ్రీవాల్, సిసోడియా, ఇతర ఆప్ నేతలపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈడీ ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో దూకుడు పెంచింది.

ఈ క్రమంలో ఆప్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ కూడా చేసింది. ఈ కేసుకు సంబంధించి తరువాత అరెస్ట్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ అని పేర్కొన్న చంద్రశేఖర్.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని తెలిపాడు. క్రిమినల్ కేసులో అరెస్టయిన తన భర్తకు బెయిల్ ఇప్పించేందుకు మల్వీందర్ సింగ్ భార్య జప్నా సింగ్‌ను రూ. 3.5 కోట్లకు మోసం చేశాడని ఆరోపిస్తూ సుకేష్ చంద్రశేఖర్ గతేడాది అరెస్టయ్యాడు. సింగ్ ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్.

తాజాగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు. శుక్రవారం చంద్రశేఖర్ కోర్టుకు హాజరు కాగా.. న్యాయస్థానం అతనికి మార్చి 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కాగా చంద్రశేఖర్‌ మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ఈడీ దర్యాప్తులో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీ, మరికొంత మంది పేర్లు బయటపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు