Drone Attack Off Gujarat Coast: అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్‌ దాడి..

23 Dec, 2023 18:18 IST|Sakshi

అరేబియా సముద్రం ద్వారా భారత్‌ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్‌ తీరంలో డ్రోన్‌ దాడి జరిగింది. పోరుబందర్‌ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. డ్రోన్‌ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్‌ పేలి మంటలు చెలరేగాయి. అయితే ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నౌక మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో 20 మంది భారతీయులు నౌకలో ఉన్నారు. 

ఈ విషయాన్ని బ్రిటన్‌ సముద్ర మారిటైమ్‌ ఎజెన్సీ అంబ్రే శనివారం పేర్కొంది. లైబేరియన్‌ జెండాతో ఉన్న ఈ నౌక.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎంవీ కెమ్‌ ఫ్ల్యూటో అనే వాణిజ్య నౌక. ప్రమాదంపై సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు..‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సాయం చేసేందుకు సదరు ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్‌ అలర్ట్‌ చేసినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. 

ప్రస్తుతం భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్‌ విక్రమ్‌ ఘటనాస్థలానికి వెళ్లి  వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. కాగా ఈ నౌక సౌదీ అరేబియా ఓడరేవు నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు వైపు వెళుతోంది.  అయితే.. ఆ నౌకపై డ్రోన్‌ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.
చదవండి: Temple Vandalised: భారత్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌

>
మరిన్ని వార్తలు