G20 Summit: క్రిప్టో సమాచారం ఇచ్చిపుచ్చుకుందాం

10 Sep, 2023 04:58 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచార వ్యవస్థ క్రిప్టో అసెట్‌ రిపోరి్టంగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (సీఏఆర్‌ఎఫ్‌) ఏర్పాటును వేగంగా అమలు చేయాలని జీ–20 సభ్య దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆర్థికేతర ఆస్తులపై సమాచార మార్పిడిని 2027 నాటికి ప్రారంభించాలని నిర్ణయించాయి. 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్టుగా ప్రపంచవ్యాప్తంగా న్యాయ, స్థిర, ఆధునిక అంతర్జాతీయ పన్నుల వ్యవస్థ పట్ల సహకారాన్ని కొనసాగించాలనే నిబద్ధతను అభివృద్ధి చెందుతున్న, చెందిన 20 దేశాల నాయకులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

పెద్ద కంపెనీల కోసం పన్ను నియమాలను మార్చడానికి, బహుళజాతి సంస్థల పన్ను ప్రణాళికను పరిమితం చేయడానికి మరింత శాశ్వత, సమర్థవంత ప్రణాళికను కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) చర్చిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలు పన్నులు చెల్లించే అంశాలను మార్చడం, ప్రపంచవ్యాప్తంగా కనీస పన్నును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రెండు మూల స్తంభాలుగా పేర్కొంటూ కసరత్తు చేస్తున్నారు. రెండు స్తంభాల పరిష్కారంలో జీ–20 దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఓఈసీడీ సహకారంతో పన్ను, ఆర్థిక నేర పరిశోధన కోసం దక్షిణాసియా అకాడమీ పైలట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు.

మరిన్ని వార్తలు