Madhya Pradesh: ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’

2 Dec, 2023 17:04 IST|Sakshi

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో సింధియా శనివారం గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడారు.

‘రేపటి కౌంటింగ్‌లోమాకు పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 24 గంటలు ఆగండి.. ఫలితాలు మన ముందే ఉంటాయి’ అన్నారు. 

ఇంతకుముందు మాట్లాడిన ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భారీ మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని, అత్యధిక మెజారిటీతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం చెప్పారు. 

మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించగా 77.15 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ జీజేపీ వైపే మొగ్గు చూపాయి.

మరిన్ని వార్తలు