సాక్షి, బెంగళూరు: ఏడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న 570 క్రిమినల్ కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ న్యాయవాది సుధా కాట్వా హైకోర్టులో వేసిన పిటిషన్పై ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ తన నిర్ణయాన్ని సమర్థించుకొంది. గురువారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి ఎఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అడ్వకేట్ జనరల్ తన వాదనలను వినిపించి కాలావకాశం కోరటంతో కేసును వాయిదా వేశారు. సమాజంలో సౌహార్థతను కల్పించటానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, రైతులు, ప్రజాప్రతినిధులపై ఉన్న 570 క్రిమినల్ కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్కడా చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుచుకోలేదని సృష్టం చేసింది.