మాకు సీక్రెట్‌గా సపోర్ట్‌ ఇవ్వండి.. బీజేపీ నేతలకు ఆఫర్‌ ఇచ్చిన కేజ్రీవాల్‌!

9 Oct, 2022 21:19 IST|Sakshi

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగానే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫోకస్‌ పెంచారు. గుజరాత్‌లో ఆప్‌ జెండా ఎగురవేయాలని వరుస సమావేశాలు జరుపుతున్నారు. 

కాగా, ఆదివారం గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీజేపీపై కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు ఏదైనా చేయాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు నన్ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాంటి వారు ఆప్‌కు మద్దతుగా రహస్యంగా పనిచేయాలని కోరుతున్నాను. గుజరాత్‌లో దాదాపుగా 27 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ గుజరాతీలకు చేసిందేమీ లేదు. వారి అహంకారాన్ని గుజరాతీలు అణచివేయాలి. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ సరికొత్త పాలిటిక్స్‌, కొత్త ఆలోచనలకు అవకాశం ఇస్తూనే ఉంటుంది. ఆప్‌కు మద్దతు ఇస్తే మీ వ్యాపారాలను నాశనం చేస్తారని తెలుసు. అందుకే మీ పని మీరు చేసుకుంటూనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వారిని ఓడించేందుకు రహస్యంగా మాకు మద్దతు ఇవ్వండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తనను హిందూ వ్యతిరేకి అని పేర్కొంటూ వెలసిన పోస్టర్లపై కేజ్రీవాల్‌ స్పందించారు. పోస్టర్లు ఏర్పాటు చేసిన వారు రాక్షస వారసులు అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు