పోక్సో నిందితుడికి బెయిల్‌.. ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ కాకముందే! దేశంలోనే తొలిసారి?

11 Mar, 2023 13:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: పోక్సో కేసులో అరెస్ట్‌ అయిన నిందితుడికి(45).. అదీ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు కాకముందే బెయిల్‌ మంజూరు చేసింది ఓ న్యాయస్థానం. తద్వారా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన కోర్టుగా నిలిచింది ముంబై సెషన్‌ కోర్టు. 

ముంబై వకోలా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి.. తన మూడేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ జనవరి చివరివారంలో పోలీసులను ఆశ్రయించింది. తన కూతురు పొరుగింట్లోకి తరచూ వెళ్తుందని, ఈ క్రమంలో తన కూతురిపై పొరుగింట్లో ఉండే వ్యక్తి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. 20 రోజుల తర్వాత విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఆమె, తర్వాత మరో రెండు రోజులు ఆగి పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా పోక్సో చట్టం ప్రకారం నిందితుడి అరెస్ట్‌ చేశారు పోలీసులు. కానీ,  ఛార్జ్‌షీట్‌ ఇంకా ఫైల్‌ చేయలేదు. సాధారణంగా ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ అయ్యాకే.. బెయిల్‌ విషయంలో కోర్టును ఆశ్రయించొచ్చు.

ఈ లోపు నిందితుడు బెయిల్‌ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించాడు. తన(నిందితుడు) క్లయింట్‌ ఓ ప్రముఖ ఆయిల్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడని, ఘటన జరిగినట్లు చెప్తున్న రోజున ఆఫీస్‌లోనే ఉన్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు నిందితుడి తరపు న్యాయవాది. అంతేకాదు.. రెండు ఇళ్ల మధ్య ఉన్న పైప్‌లైన్‌ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తన క్లయింట్‌ను బద్నాం చేసే ఉద్దేశంతోనే తప్పుడు కేసు పెట్టినట్లు వాదించాడాయన. 

మరోవైపు.. ప్రాసిక్యూషన్‌ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు ఈ పోక్సో కేసులో ఛార్జ్‌షీట్‌ కూడా ఇంకా ఫైల్‌ కాలేదని.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. నిందితుడు, బాధిత కుటుంబం పొరుగింట్లోనే ఉంటాడు గనుక అతని నుంచి వాళ్లకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉండొచ్చని, కేసును ప్రభావితం చేయొచ్చని వాదించారు. అయితే.. కోర్టు మాత్రం నిందితుడి తరపు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది. 

మరిన్ని వార్తలు