చక్రవడ్డీ మాఫీ : వారికి సుప్రీం షాక్‌

20 Nov, 2020 13:46 IST|Sakshi

క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

లోన్ మారటోరియం ప్రయోజనాలు వారికి అందకూడదు

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ కాలంలో విధించిన ఆరు నెలల మారటోరియం కాలానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది.క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డ్‌ రుణాల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి మారటోరియం ప్రయోజనాలు అవసరమా అంటూ అత్యున్నత న్యాయస్థానం గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది.  క్రెడిట్ కార్డుదారులు రుణగ్రహీతల కిందకు రారని చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇవ్వకూడదని అభిప్రాయపడింది వాస్తవానికి వారు రుణాలు పొందలేదని, దానికి బదులుగా వస్తువులు కొనుగోళ్లు చేశారని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ప్రీ-కోవిడ్ డిఫాల్టర్లు కూడా చక్రవడ్డీ మాఫీ పొందలేరని తెలిపింది. లోన్ మారటోరియం, ప్రయోజనాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

వడ్డీ మినహాయింపు ప్రణాళికలో ఇప్పటివరకు 13.12 కోట్ల ఖాతాలకు రూ .5270 కోట్లు జమ అయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం మార్చినుంచి ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ .2 కోట్ల వరకు ఉన్న అన్ని రుణాలపై వడ్డీవడ్డీని రద్దు చేసింది. ఈ  భారాన్ని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన చెల్లింపులను కూడా ప్రారంభించింది.

మరిన్ని వార్తలు