సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు పెంపుపై కేంద్రం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దాన్ని పెంచితే సరైన అర్హత లేని, సరైన పనితీరు కనబరచని న్యాయమూర్తుల సర్వీసూ పెరుగుతుంది. పైగా ప్రభుత్వోద్యోగుల నుంచీ రిటైర్మెంట్ వయసు పెంపు డిమాండ్కు ఇది దారి తీయొచ్చు’’ అని పేర్కొంది. ఈ మేరకు సిబ్బంది, న్యాయ వ్యవహారాల పార్లమెంటు సంఘానికి ప్రజెంటేషన్ సమర్పించింది. ‘‘కాబట్టి ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరముంది.
ఉన్నత న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం చేపట్టే చర్యల్లో భాగంగా రిటైర్మెంట్ వయసు పెంపు అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్లు, హైకోర్టు న్యాయమూర్తులు 62 ఏళ్లకు రిటైరవుతున్నారు. దీన్ని పెంచేందుకు 2010లో 114వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ 15వ లోక్సభ రద్దుతో దానికి కాలదోషం పట్టింది.