‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు!

27 Oct, 2022 14:41 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. పీఓకే ప్రజలపై పాకిస్థాన్‌ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్‌, బాల్టిస్తాన్‌ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్‌ కార్యక్రమంలో మాట్లాడారు.  

‘జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్‌, బాల్టిస్తాన్‌ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్‌.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్‌ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు.

ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్‌ వర్సెస్‌ సీఎం

మరిన్ని వార్తలు