Ayodhya: బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు 84 సెకెన్ల సూక్ష్మ ముహూర్తం!

23 Dec, 2023 11:05 IST|Sakshi

రాబోయే జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. 84 సెకన్ల సూక్ష్మ ముహూర్తంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన రామాలయంలో బాల రాముని విగ్రహ ‍ప్రతిష్ఠాపనకు ఐదు ముహూర్తాలు ప్రతిపాదించారు. అయితే రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతిమ నిర్ణయాన్ని గీర్వాణవాగ్వర్ధిని సభకు, కాశీ పండితులకు వదిలివేసింది.

జనవరి 22న అత్యంత శుభ ముహూర్తంగా వారు నిర్ణయించారు. జనవరి 17, 21, 24, 25 తేదీలలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన శుభ ముహూర్తాన్ని దేశంలోని నలుమూలలకు చెందిన పండితులు అందించారు. వారిలో కాశీకి చెందిన పండితుతు పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ అందించిన ముహూర్తాన్ని ఎంపిక చేశారు.  అభిజిత్ ముహూర్తంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి చాలా సూక్ష్మమైన శుభ సమయం ఉందని గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. జనవరి 22న మేష రాశిలో వృశ్చిక నవాంశ వేళ.. మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు 84 సెకన్ల సమయం కలిగిన ఈ ముహూర్తాన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. 

బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని కాశీలోని వైదిక బ్రాహ్మణులు పర్యవేక్షించనున్నారు. కాశీ నుండే పూజలకు కావాలసిన సామగ్రిని తరలించనున్నారు. కాశీ నుండి పండితుల మొదటి బ్యాచ్ డిసెంబర్ 26న అయోధ్యకు బయలుదేరనుంది. వీరు యాగశాల, పూజా మండపం పనులు చేపట్టనున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో 51 మంది వేద పండితులు పాల్గొననున్నారు. 
ఇది కూడా చదవండి: ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరివైపే.. 

>
మరిన్ని వార్తలు