సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. పిల్‌పై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ మండిపాటు

20 Mar, 2023 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో సహజీవనం చేసే జంట.. తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. దీన్నొక మూర్ఖపు ఆలోచనగా అభివర్ణిస్తూ పిటిషన్‌ కొట్టేశారు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. 

దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, ఈ మేరకు రిలేషన్‌షిప్‌లో ఉండే ప్రతీజంట రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే.. ఆ జంటలకు సామాజిక భద్రత కల్పించాలంటూ ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఆ ఆలోచన ద్వారా సహజీవనంలో జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు ఆ న్యాయవాది. 

అయితే.. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఘాటుగా స్పందించారు. ఎలాంటి విషయంతోనైనా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇకపై జరిమానాలు విధించడం మొదలుపెడతాం. ఏంటిది?.. రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీనవంలో ఉన్న జంటలతో కేంద్రం ప్రభుత్వానికి ఏం పని? ఏం సంబంధం అసలు? అంటూ చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏ ఉద్దేశంతో పిటిషన్‌ వేశారని న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. సోషల్‌ సెక్యూరిటీ అనే సమాధానం ఇచ్చారాయన. ఒకానొక తరుణంలో న్యాయవాదిపై ఆగ్రహం వెల్లగక్కిన సీజేఐ.. పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు. 

ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ ఘటన.. ఆపై వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలుకా నేరాలు వెలుగులోకి రావడంతో  కేంద్రం తరపు నుంచి లివింగ్‌ రిలేషన్‌షిప్‌లపై రిజిస్ట్రేషన్‌, గైడ్‌లైన్స్‌ల కోసం తాను సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారా న్యాయవాది.

ఇదీ చదవండి: ఓటీటీ కంటెంట్‌పై కేం‍ద్రం సీరియస్‌!

మరిన్ని వార్తలు