కూతురి నుంచి ప్రాణహాని.. సంచలన ఆరోపణలు

1 Dec, 2020 09:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు షీలా రషీద్‌పై ఆమె తండ్రి అబ్దుల్‌ సోరా సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కశ్మీర్‌ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి పెద్ద ఎత్తను నగదు జమచేస్తోందని పేర్కొన్నారు. తన కూతురుకు చెందిన ఎన్‌జీవోపై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్‌ డీజీసీ దిబాగ్‌ సింగ్‌కు సోమవారం రాత్రి మూడు పేజీల లేఖను రాశారు.  ఆ లేఖలో పలు సంచలన ఆరోపణలు చేశారు.


‘నా కూతురు షీలా, భార్య, చిన్న కూతురు నుంచి నాకు ప్రాణహాని, మా ఇంటి సెక్యూరిటీతో కలిసి నన్ను హతమార్చేందుకు కుట్రపన్నుతున్నారు. సంఘ విద్రోహ శక్తులతో కలిసి షీలా దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతోంది. ఆమెకు పెద్ద ఎత్తున డబ్బు కూడా అందుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త నుంచి ఇటీవల మూడు కోట్ల రూపాయాలు అందాయి. ఆమె నిర్వహిస్తున్న  ఎన్‌జీవో ఎన్నో అక్రమాలకు పాల్పడుతోంది. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపించాలి. నన్ను ఇంట్లో బంధించిన గృహహింసకు పాల్పడుతున్నారు. వారి నుంచి నాకు రక్షణ కల్పించండి’ అంటూ డీజీపీకి రాసిన లేఖలో షీలా తండ్రి సోరా పేర్కొన్నారు. సోరా లేఖను స్వీకరించిన పోలీసులు.. దీనిపై త్వరలోనే విచారణ చేపట్టనున్నారు.

కాగా జేఎన్‌యూలో విద్యార్థి నేతగా వెలుగులోకి వచ్చిన షీలా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ విభజనకు వ్యతిరేకంగా గళం విప్పి.. నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. గతంలో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. మరోవైపు తండ్రి చేసిన ఆరోపణలను షీలా తీవ్రంగా ఖండించారు. తాము సోరాను ఎంతో బాగా చూసుకుంటామని, ఇలాంటి ఆరోపణలు చేస్తారని అస్సలు ఊహించలేదని తెలిపారు. దీనిపై చట్టపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు